హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్ను ఖాళీ చేయించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ డ్రైవింగ్ చేస్తూ.. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అంబేద్కర్ భవన్ను పరిశీలించి.. అక్కడ జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు.
కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎయిర్పోర్టుకు బెంగుళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. రన్వే పూర్తిగా పొగమంచుతో నిండిపోవడంతో.. సేఫ్ ల్యాండింగ్కు ఇబ్బంది కలిగింది. ఈ సమయంలో రిస్క్ తీసుకోని పైలెట్.. కొద్దిసేపు గాల్లోనే విమానాన్ని చక్కర్లు కొట్టించాడు. ఆ తర్వాత ఎయిర్పోర్టు అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాక.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
ప్రకాశం జిల్లాలోని బొమ్మలాపురం, ఊరకొండ వద్ద పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవుకు.. యజమాని చెన్నారెడ్డి ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో వైద్యం చేయించారు. కానీ తీవ్రగాయాల వల్ల ఆవు చనిపోయింది.
భద్రాచలంలో సబ్జా రవిని హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ మృతుని బంధువులు ఆందోళన చేస్తున్నారు. గంజాయి బ్యాచే రవిని నడిరోడ్డుపై అతి దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఏఎస్పీ విక్రమ్ సింగ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 434 రోజులు పొడిగించింది. సాంకేతిక కారణాల వల్ల పనులు ఆలస్యమైనట్లు టెక్నికల్ కమిటీ ధృవీకరించడంతో.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధి వట్టేపల్లిలో పాతకక్షల నేపథ్యంలో రౌడీషీటర్ సయ్యద్ సోహైల్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న జమీల్ అనే యువకుడిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జమీల్ను.. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమర్పించిన అఫిడవిట్పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటుగా స్పందించారు. కడియం తీరును తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారలేదని చెప్పడం నీతిమాలిన చర్య అని విమర్శించారు.
వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురి కార్యకర్తలకు, అడ్డుకోబోయిన పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
విజయవాడలో శిశు విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసింది టాస్క్ఫోర్స్. పక్కా సమాచారంతో గుట్టుచప్పుడు కాకుండా అరెస్టు చేసింది. నిందితులు సరోజ, విజయలక్షి, బ్లెస్సి, నందిని, బాబావలినీ అదుపులోకి తీసుకుంది. వీరందరిని భవానీపురం పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ఆఫీసుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ కార్యలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు పిలుపునిచ్చాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి లేదన్నారు.
కుమురం భీం జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కేరమేరి మండలం పరందొలి ఘాట్ రోడ్డుపై ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. బస్సును లోయలోకి పడిపోకుండా చాకచక్యంగా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి మళ్లించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. రెండు వర్గాలు పరస్పర నినాదాలు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై.. ఈడీ కేసులను కోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో ధర్నా చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గోలపల్లి అటవీ కొండల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల దగ్గర నుంచి ఆయుధాలు, కొన్ని విలువైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలో 14వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండియా కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇరాన్లోని హోర్ముజ్ ద్వీపం భారీ వర్షాల వల్ల ఎర్రగా మారింది. ఇక్కడి కొండల్లో సమృద్ధిగా ఉండే ఐరన్ ఆక్సైడ్ ఖనిజం.. వర్షపు నీటితో కలిసి సముద్రంలో చేరడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఎర్రమట్టి వల్ల పర్షియన్ గల్ఫ్ అలలు ఆకర్షణీయమైన ఎరుపు రంగులోకి మారాయి.
భారత్లో ఫుట్బాల్కు గొప్ప భవిష్యత్తు ఉంటుందని అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అన్నాడు. నాలుగు నగరాల పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన అతను.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. డిసెంబర్ 13న కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మొదలైన పర్యటనలో అస్తవ్యస్తత ఏర్పడినప్పటికీ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
బిలియనీర్ల పెళ్లిళ్లో ఇకపై తాను డ్యాన్స్ చేయనని బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బిలియనీర్లు వారి వివాహ వేడుకల్లో సెలబ్రిటీలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారని.. ఈ ట్రెండ్ను ఇకపై తాను ప్రోత్సహించాలని అనుకోవడం లేదని సృష్టం చేశారు.
నటి నిధి అగర్వాల్ ఫ్యాన్స్ వల్ల అసౌకర్యానికి గురయ్యారు. ది రాజాసాబ్ పాట లాంఛ్ ఈవెంట్కు వచ్చిన ఆమె.. తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో వందల మంది అభిమానులు నిధి వద్దకు వచ్చారు. కొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. నిధి బాడీగార్డులు అందరినీ కంట్రోల్ చేసి ఆమెను క్షేమంగా కారు ఎక్కించారు. కారు ఎక్కిన తర్వాత నిధి ఊపిరి పీల్చుకున్నారు.