Saketh Sreenivasaiah death: అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ (UC Berkeley)లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) విషాదాంతం కావడం తీవ్ర కలకలం రేపింది. ఫిబ్రవరి 9వ తేదీ నుండి అదృశ్యమైన ఈ యువకుడు చనిపోయినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. స్థానిక పోలీసులు సాకేత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని, ఈ కఠిన సమయంలో అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా కాన్సులేట్ ప్రకటించింది.
కర్ణాటకకు చెందిన సాకేత్ అదృశ్యం కావడానికి ముందు, అతను బర్కిలీ కొండల్లోని ‘లేక్ అంజా’ సమీపంలో చివరిసారిగా కనిపించినట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే, అతని పాస్పోర్ట్, ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ మాత్రం ఒక ఇంటి గుమ్మం వద్ద లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాకేత్ అదృశ్యం కాగానే అతని రూమ్మేట్ బనీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు. తన స్నేహితుడి ఆచూకీ కోసం పోలీసులతో కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని ఆయన కోరినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
సాకేత్ శ్రీనివాసయ్య ఐఐటి మద్రాస్ నుండి 2025లో కెమికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం యూసీ బర్కిలీలో కెమికల్ అండ్ బయో మాలిక్యులర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఒక మెరిటోరియస్ విద్యార్థిగా తన కెరీర్ను నిర్మించుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరగడం విచారకరం. సాకేత్ అదృశ్యం వార్త తెలియగానే కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. స్థానిక పోలీసుల గాలింపు చర్యలకు దౌత్యపరమైన మద్దతు అందించాలని మరియు త్వరితగతిన సాకేత్ ఆచూకీ కనుగొనేలా చూడాలని ఆమె కోరారు.
ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం సాకేత్ కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అతని భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కాన్సులేట్ అధికారులు తెలిపారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసే బాధ్యతను కాన్సులేట్ స్వీకరించింది. విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, సాకేత్ మృతికి గల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.