India Bullet Train: 2027, ఆగస్టు 15న భారతదేశం తన మొట్టమొదటి బుల్లెట్ రైలును అందుకునే అవకాశం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. వచ్చే ఏడాదిలో భారత్ లో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడతాయన్నారు. “2027లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు బుల్లెట్ రైలు టికెట్ కొనండి, దేశానికి మొదటి బుల్లెట్ రైలు రాబోతుంది” అని ప్రెస్ మీట్ లో ఆయన అన్నారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా సరికొత్త విశ్వాసాన్ని నింపాయన్నారు. వందే భారత్ రైళ్లను నడపాలని దేశ నలుమూలల నుండి అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపారు. దాదాపు ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో వందే భారత్ రైలును కోరుకుంటున్నారు. అదే సౌకర్యం, భద్రతా ప్రమాణాలతో వందే భారత్ స్లీపర్ రైళ్లను రాత్రిపూట ప్రయాణానికి అనుకూలంగా రూపొందించామని చెప్పారు.
ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ.ల విస్తీర్ణంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రూపొందిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుల్లెట్ ట్రైన్ రాకతో ఇంటర్ సిటీ ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని హామీ ఇచ్చారు. భారత్ లో ప్రపంచ స్థాయి హై-స్పీడ్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయన్నారు.
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ దశలవారీగా ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
బుల్లెట్ ట్రైన్ ను దశలవారీగా అహ్మదాబాద్, వడోదర, భరూచ్, సూరత్, వాపి, థానే, ముంబై వంటి కీలక నగరాలకు క్రమంగా విస్తరిస్తామన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. గుజరాత్, దాద్రా-నాగర్ హవేలిలలో 352 కి.మీ, మహారాష్ట్రలో 156 కి.మీ.లను కవర్ చేయనుందన్నారు.
నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం ఈ కారిడార్లో 85% కంటే ఎక్కువ ఎలివేటెడ్ వయాడక్ట్లపై నిర్మించనున్నారు. 326 కి.మీ ఎలివేటెడ్ నిర్మాణాలు ఉండనున్నాయి. అలాగే ఈ రూట్ లో మొత్తం 25లో 17 చోట్ల నదిపై వంతెనలను నిర్మించారు. 47 కి.మీ సూరత్-బిలిమోరా కారిడార్ అత్యంత అధునాతనమైన స్ట్రెచ్లలో ఒకటి. సివిల్, ట్రాక్-బెడ్ తయారీ ఇప్పటికే పూర్తైంది.
Also Read: ఈ రూట్ లోనే తొలి వందే భారత్ స్లీపర్.. ఛార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ
తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలనే ప్రతిపాదన ఉంది. ఇది సికింద్రాబాద్ లో స్టార్ట్ అయి విజయవాడ, గుంటూరు మీదుగా బెంగళూరు చేరుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో అమరావతి, హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రారంభం కావోచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతాయి.