Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ రెడీ అయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను గౌహతి నుంచి కోల్ కతాకు తొలి వందే భారత్ స్లీపర్ నడుపుతున్నట్లు తెలిపారు. 180 కిలోమీటర్ల స్పీడుతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతం అయిందన్నారు. త్వరలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్, టెస్టింగ్, సర్టిఫికేషన్ పూర్తైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి స్లీపర్ రైలును గౌహతి, కోల్కతా నడపనున్నట్లు గురువారం ప్రకటించారు.
“దేశంలో చాలా కాలంగా కొత్త తరం రైళ్లకు డిమాండ్ ఉంది. వందే భారత్ చైర్ కార్ భారతీయ రైల్వేలలో సరికొత్త శకాన్ని ప్రారంభించింది. తమ ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను నడపాలని డిమాండ్లు వస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలును 1000 కిలోమీటర్లకు పైగా దూర ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
దూర ప్రయాణికులు వేగంగా చేరుకునేందుకు ఈ తరహా రైళ్లను కోరుకుంటున్నారు. వందే భారత్ స్లీపర్లో హైసెక్యురిటీ, సస్పెన్షన్ వ్యవస్థ, రాత్రిపూట ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేయడానికి కొత్త టెక్నాలజీ అమర్చారు” అని రైల్వే మంత్రి తెలిపారు.
గౌహతి-హౌరా రూట్ ఛార్జీ సుమారు రూ. 2300గా నిర్ణయించామని రైల్వే మంత్రి తెలిపారు. సాధారణంగా విమాన ఛార్జీలు గౌహతి-హౌరా మార్గంలో రూ.6,000 నుంచి రూ.8,000 మధ్య ఉన్నాయని, కొన్నిసార్లు రూ.10 వేలు కూడా చేరుకుంటున్నాయన్నారు.
వందే భారత్ స్లీపర్లో గౌహతి నుంచి హౌరాకు 3AC ఛార్జీ సుమారు రూ.2,300గా నిర్ణయించామన్నారు. 2AC ఛార్జీ దాదాపు రూ.3,000, ఫస్ట్ AC ఛార్జీ సుమారు రూ.3,600గా ప్రతిపాదించామని అన్నారు. 2026 చివరి నాటికి, దాదాపు 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులో వస్తాయన్నారు.
“రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) పర్యవేక్షణలో వందే భారత్ స్లీపర్ రైలు హై-స్పీడ్ ట్రయల్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కోట-నాగ్డా రూట్ లో ఈ ట్రయల్ నిర్వహించారు. ఈ సమయంలో రైలు గరిష్టంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణించింది. ట్రయల్ సమయంలో రైడ్ స్టెబిలిటీ, వైబ్రేషన్, బ్రేకింగ్ పనితీరు, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థ, భద్రతా వ్యవస్థలు సాంకేతికతను పరీక్షించారు. హై-స్పీడ్ ట్రయల్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాం. ఈ వీడియోలో వాటర్-గ్లాస్ స్టెబిలిటీని కూడా మీరు చూడవచ్చు” –రైల్వే మంత్రి
Also Read: గంటకు 180 కిమీల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్ రైలు, వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి
ట్రయల్ రన్ లో 16-కోచ్ ల వందే భారత్ స్లీపర్ రేక్ పరీక్షించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో సౌకర్యవంతమైన స్లీపర్ బెర్త్లు, అధునాతన సస్పెన్షన్ సిస్టమ్లు, ఆటోమేటిక్ తలుపులు, ఆధునిక టాయిలెట్లు, మంటలను గుర్తించే భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలు, సీసీటీవీ నిఘా, డిజిటల్ ప్రయాణికులకు సమాచార వ్యవస్థ వంటి సాంకేతికత ఉన్నాయన్నారు. రైలు ప్రమాదాలను నివారించేందుకు కవచ్ సిస్టమ్ కూడా అమర్చినట్లు చెప్పారు.