Bihar Elections: మగధ సామ్రాజ్యంలో మరోసారి ఎన్డీఏదే విజయంగా తేలింది. బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఎన్డీఏ కూటమిదే అధికారంగా ప్రకటించాయి. బీజేపీ, జేడీయూ కూటమి..మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇక విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహాగట్భంధన్ కూటమికి సర్వేలు నిరాశను మిగిల్చాయి. దైనిక్ భాస్కర్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, జేవీసీ, పీ మార్క్ వంటి ఫేమస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలన్నీ బీహార్లో ఎన్డీఏకే పట్టం కట్టాయి.
దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి 145 నుంచి 160 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాగట్భంధన్ కూటమి 73 నుంచి 91 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడించింది. అలాగే ఇతరులు 8 సీట్లను సొంతం చేసుకుంటారని అంచనా వేసింది. ఇక పీపుల్స్ ఇన్సైట్ సర్వే ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమి 133 నుంచి 148 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. మహాగట్భంధన్ కూటమి 87 నుంచి 102 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే ఇతరులు 3 నుంచి 6 సీట్లను సొంతం చేసుకుంటారని తెలిపింది.
పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ కూడా బీహార్లో ఎన్డీఏ కూటమిదే విజయంగా తేల్చింది. ఈ సంస్థ ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మహాగట్భంధన్ కూటమి 75 నుంచి 101 సీట్లలో గెలుస్తుందని తెలిపింది. ఇతరులు 5 సీట్లను సొంతం చేసుకోవచ్చని అంచనా వేసింది. మరోవైపు మాట్రిజ్ సర్వే సంస్థ ప్రకారం కూడా బీహార్లో నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే అధికారాన్ని దక్కించుకుంటుంది ప్రకటించింది. ఈ సంస్థ ఎన్డీఏ కూటమికి 147 నుంచి 167 సీట్లలో విజయం సాధిస్తుందని తేల్చింది. మహాగట్భంధన్ కూటమి 70 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇతరులు 8 సీట్ల వరకు గెలుచుకోవచ్చని పేర్కొంది.
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ బీహార్లో ఎన్డీఏ కూటమే మరోసారి విజయం సాధిస్తుందని వెల్లడించింది. ఈ సంస్థ ఎన్డీఏ కూటమి 130 నుంచి 138 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మహాగట్భంధన్ కూటమి 100 నుంచి 108 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. ఇతరులు 2 నుంచి 8 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ప్రకటించింది. అటు టైమ్స్ నౌ కూడా ఎన్డీఏదే విజయంగా అభివర్ణించింది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 135 నుంచి 150 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మహాఘట్ బంధన్ 83 నుంచి 105 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది. ఇక జన్ సురాజ్ పార్టీ కేవలం ఒకే సీటులో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇతరులు 3 నుంచి 6 స్థానాల్లో గెలుస్తారని ప్రకటించింది.
P మార్క్, JVC సంస్థలు కూడా బీహార్లో ఎన్డీఏ కూటమిదే అధికారంగా అభివర్ణించాయి. పీ మార్క్ ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమికి 142 నుంచి 162 సీట్లు, మహాగట్భంధన్కు 80 నుంచి 98 సీట్లు, ఇతరులు 7 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అటు జేవీసీ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి 135 నుంచి 150 సీట్లు, మహాగట్భంధన్కు 100 నుంచి 108 సీట్లు, ఇతరులు 3 నుంచి 5 సీట్లు దక్కొచ్చని ప్రకటించింది.