Bankipur by election: బంకీపూర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీహార్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు జన సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై పదునైన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. తాజాగా ఉపఎన్నిక నుంచి బీజేపీ తప్పుకోవడంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
బీహార్లో వేడెక్కిన బంకీపూర్ బైపోల్- బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకీపూర్ సీటుకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు జన సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్.
డ్రాపైన బీజేపీ అభ్యర్థి, రేసులో మరొకరు-అధికార బీజేపీ నుంచి రేసులో ఎవరూ లేనట్టు కనిపిస్తోంది. తొలుత బీజేపీ తరపున బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్ కుమార్ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నారట. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వెంటనే స్పందించిన బీజేపీ హైకమాండ్, యువజన విభాగం నేత నీరజ్ కుమార్ సిన్హాను కొత్త అభ్యర్థిగా బరిలోకి దించనుంది.
భయంతోనే బీజేపీ తప్పుకుందని పీకే వ్యాఖ్య- ఆయన తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి జులై 30న పోలింగ్ జరగనుంంది. ఆగస్టు 3న ఫలితం వెల్లడికానుంది. కంచుకోట సీటులో బీజేపీ అభ్యర్థి తప్పుకోవడాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పీకే. ఈ నేపథ్యంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంపై ధ్వజమెత్తారు.
బీజేపీ చరిత్రలో ఇదొక అపూర్వమైన ఘట్టమని, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి తప్పుకోవడం చూస్తుంటే ఓటమి భయంతో పారిపోయిందని ఆరోపించారు. ఈ సీటు నుంచి పీకే బరిలోకి దిగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు బీజేపీ ఒత్తిడి లేకుంటే భయానికి ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం చూశామని అన్నారు.
ALSO READ: తమిళనాడులో ఘోర ప్రమాదం.. విద్యుల్ షాక్తో నలుగురు కార్మికులు మృతి!
దేశచరిత్రలో తొలిసారి బీజేపీ అభ్యర్థి భయపడి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి కంచుకోటలో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. అదే సమయంలో బీహార్ సీఎం సామ్రాట్ చౌదరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను బీహార్ ప్రజలు సీఎంగా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.