Puri Rath Yatra 2026: ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది జూలై 16 నుంచి 27 వరకు అత్యంత వైభవంగా ఈ రథోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు ఒడిశా ప్రభుత్వం, స్థానిక జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. బలభద్రుడు, సుభద్ర దేవి, జగన్నాథ స్వామివార్లు తమ రథాలపై కొలువై భక్తజనకోటికి దర్శనమిచ్చే ఈ పవిత్ర దినాల కోసం ఆధ్యాత్మిక లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది.
గాల్లో భద్రతా నిఘా..
లక్షలాది మంది భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని పూరి పట్టణంలో భద్రతను అత్యంత కఠినతరం చేశారు. రథయాత్ర సాగే ప్రధాన ప్రాంతాల చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల పరిధిని నో-ఫ్లయింగ్ జోన్గా అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఈ పరిధిలో సాధారణ ప్రజలు లేదా ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లను ఉపయోగించడంపై పూర్తిగా నిషేధం విధించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
పటిష్టమైన ఏరియల్ సర్వే..
శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించేందుకు వీలుగా కేవలం అధికారిక ఏజెన్సీలకు మాత్రమే డ్రోన్ల వినియోగానికి అనుమతి ఇచ్చారు. అది కూడా జిల్లా యంత్రాంగం నుంచి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకున్న ప్రభుత్వ విభాగాలు మాత్రమే వీటిని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా భద్రతా పర్యవేక్షణ, ఏరియల్ సర్వే, అధికారిక ఫోటోగ్రఫీ, అలాగే అత్యవసర విపత్తు నిర్వహణ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల కోసమే ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు..
రథయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, తాత్కాలిక వైద్య శిబిరాలు, ప్రత్యేక రవాణా సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను తట్టుకునేలా ప్రధాన వీధుల్లో ప్రత్యేక షెడ్లను నిర్మిస్తున్నారు. పూరికి రాలేని కోట్లాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు వీలుగా దూరదర్శన్తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. భక్తిభావం, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ఏడాది పూరి రథయాత్ర సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది.
Also Read: సుప్రీం కోర్ట్ సీజేఐపై పేపర్లు విసిరి, దుర్భషలాడుతూ.. పిటీషనర్ హంగామా, వీడియో వైరల్