Tamil Nadu: తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మామల్లపురంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం నలుగురు కార్మికుల ప్రాణాలను కోల్పోయారు. నిత్యం పనుల్లో నిమగ్నమయ్యే కూలీల జీవితాల్లో విద్యుత్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. బోర్వెల్ పనులు చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
మామల్లపురంలో కొందరు ప్లంబింగ్ కార్మికులు బోర్వెల్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో భూమిలోంచి ఇనుప పైపులను పైకి తీస్తుండగా, పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు ఆ పైపు తగిలింది. క్షణాల వ్యవధిలోనే హైవోల్టేజ్ విద్యుత్ పైపు గుండా ప్రవహించడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యారు.
నలుగురు అక్కడికక్కడే మృతి
ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ప్లంబింగ్ కార్మికులు విద్యుత్ ధాటికి తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడికి తీవ్ర గాయాలవడంతో, గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన మలుపు.. నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డు.. ఎస్సై సస్పెన్షన్!