Father Kills: జ్యోతిష్యం, మూఢనమ్మకాల పేరుతో కన్నబిడ్డలనే కాలయముడికి అప్పగిస్తున్న ఘతుకాలు సమాజంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాలం ఎంత మారుతున్నా, సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా మనుషుల్లోని అంధవిశ్వాసాలు మాత్రం చావడం లేదు. తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. కొడుకు వల్ల తనకు ప్రాణగండం ఉందన్న ఒక జ్యోతిష్యుడి మాటలు నమ్మి, ఓ తండ్రి కన్నకొడుకునే అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
నమ్మిన జాతకం.. నడిరోడ్డుపైకి వచ్చిన బంధం
తమిళనాడులోని తేని నగరానికి చెందిన ఎంజీఆర్ నగర్ నివాసి వేందర్ బాలా(50) ‘తమిళగ మక్కళ్ మున్నేట్ర కళగం’ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్య రాజలక్ష్మి కుమారుడైన శ్రీకాంత్(20)కు, తండ్రి వేందర్ బాలాకు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయాల్లో తీవ్రమైన వివాదాలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వేందర్ బాలా ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించాడు. అయితే, “నీ సొంత కుమారుడి వల్లే నీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది” అని ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఆ తండ్రి తలకెక్కాయి. ఆస్తి గొడవలకు తోడు, జ్యోతిష్యుడి మాటలతో భయాందోళనకు గురైన వేందర్ బాలా.. తన కొడుకును ఎలాగైనా వదిలించుకోవాలని క్రూరమైన పథకం వేశాడు.
మూడేళ్ల మిస్టరీ.. కోర్టు జోక్యంతో వెలుగులోకి!
2023 సెప్టెంబర్ నెలలో శ్రీకాంత్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. తన కొడుకు కనిపించడం లేదంటూ తల్లి రాజలక్ష్మి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో, ఆమె మదురై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు 2026 ఫిబ్రవరిలో సీబీసీఐడీ (CBCID) కి బదిలీ అయింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శాస్త్రీయ కోణంలో విచారణ జరపగా, తేనె ప్రాంతానికి చెందిన అలెక్స్ పాండియన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా దొరికాడు. అతడిని తమదైన శైలిలో విచారించడంతో మూడేళ్లుగా దాగి ఉన్న ఈ నరహత్య మిస్టరీ వీడింది.
ముక్కలుగా నరికి.. నదిలో పడేసిన దారుణం
అలెక్స్ పాండియన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు బుధవారం వేందర్ బాలాను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించారు. దీంతో తండ్రే స్వయంగా తన కొడుకును చంపినట్లు అంగీకరించాడు. జ్యోతిష్యుడి మాటల వల్లే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడు. తన స్నేహితుడైన ముల్లైనగర్ కు చెందిన కరుప్పయ్య, అలెక్స్ పాండియన్ సహాయంతో శ్రీకాంత్ గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపాడు. ఆపై ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు శవాన్ని ముక్కలుగా నరికి, ‘ముల్లై పెరియార్’ నదిలో పారేసినట్లు విచారణలో వెల్లడించాడు.
Also Read: తిరుమల నడక మార్గంలో పులి కలకలం.. భయాందోళనలో భక్తులు, వైరల్ వీడియో