Supreme Court: తప్పుడు ఫిర్యాదులు, ఫోర్జరీ సాక్ష్యాలు, కల్పిత ఆరోపణల కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిణామాల కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై మంగళవారం CJI జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
తప్పుడు ఎఫ్ఐఆర్ లు, కల్పిత సాక్ష్యాలతో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టుకు కోరారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం సెక్షన్ 215, 379ల వివరణ వల్ల తప్పుడు సాక్ష్యాలు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవటం కష్టతరమవుతోందని తెలిపారు. కోర్టు ముందస్తు అనుమతి లేనిదే బాధితులు తప్పుడు ఫిర్యాదుదారులపై చర్యలు తీసుకోలేక పోతున్నారని చెప్పారు.
చట్టంలోని లొసుగులు తప్పులు చేసిన వారికి వరంలా మారుతున్నాయని పిటిషన్ కోర్టు ఎదుట వాపోయారు. దీని వల్ల పోలీస్ స్టేషన్లు తప్పుడు ఎఫ్ఐఆర్ లతో నిండిపోతున్నాయని.. ఫలితంగా న్యాయస్థానాలపై కూడా విపరీతమైన భారం పడుతోందని తెలియచేశారు. కొన్నిసార్లు తప్పుడు కేసుల వల్ల విషాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో తప్పుడు కేసుల వేధింపులు భరించ లేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న బాధితులు సామాజికంగా పరువు కోల్పోవటమే కాకుండా సుదీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపరిస్తోందని అన్నారు. ఫలితంగా మానసికంగా, ఆర్థికంగా వారు కుంగిపోతున్నారని వివరించారు.
Also Read: LPG ATM: దేశంలో తొలి గ్యాస్ ఏటీఎం.. ప్రత్యేకతలు ఏంటి? సిలిండర్ ఎలా పొందాలి!
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వద్ద తప్పుడు ఫిర్యాదులు, కోర్టుల్లో అబద్దాలు చెప్పే కేసుల విచారణకు సంబంధించి నిర్ధిష్టమైన డేటా లేకపోవటం కూడా ఓ పెద్ద లోపమని పిటిషనర్ పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చేవారు, అబద్దపు సాక్ష్యాలను సృష్టించే వారిని అడ్డుకోని పక్షంలో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందన్నారు. దీనివల్ల న్యాయ ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని సూచిస్తూ కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే నెలకు వాయిదా వేసింది.