Survival Thriller OTT : మలయాళం నుంచి వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమల్ బాయ్స్’ ఎంత సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి రియల్ సంఘటనతో ఒక థాయ్ సినిమా కూడా వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా 2018లో థాయ్లాండ్లోని థామ్ లుయాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది ఫూట్ బాల్ టీం, వాళ్ళ కోచ్ను రక్షించిన యథార్థ గాథ ఆధారంగా రూపొందింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 మంది వాలంటీర్లు పాల్గొనడం విశేషం. ఈ సినిమాలో రెస్క్యూ ఆపరేషన్ ఎంత కష్టంగా సాగిందో రియలిస్టిక్ గా చూపించారు. ముఖ్యంగా పిల్లలను బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఉపయోగించిన పద్ధతి (అనస్థీషియా ఇవ్వడం) సినిమాలోనే హైలైట్. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన థాయ్ నేవీ సీల్స్ సమాన్ కునన్, బీరూట్ పక్బారాలకు ఈ సినిమాను అంకితం ఇవ్వడం జరిగింది.
ఈ థాయ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘థర్టీన్ లైవ్స్’ (Thirteen Lives). 2022 లో వచ్చిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించగా, బెంజమిన్ వాల్ఫిష్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ అందించిన సయోంభు ముక్దీప్రోమ్ అండర్ వాటర్ విజువల్స్ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో విగ్గో మోర్టెన్సెన్, కోలిన్ ఫారెల్, జోయెల్ ఎడ్జర్టన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం Prime Videoలో తెలుగు, తమిళం, హిందీ ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
థాయ్లాండ్లో 12 మంది కుర్రాళ్లు తమ ఫుట్బాల్ కోచ్తో కలిసి సరదాగా ఒక పెద్ద గుహను చూడటానికి వెళ్తారు. కానీ దురదృష్టవశాత్తూ అప్పుడే భారీ వర్షాలు కురవడంతో, గుహలోకి వరద నీరు వచ్చి చేరి వాళ్ళు లోపలే చిక్కుకుపోతారు. బయట ప్రపంచానికి వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయం తెలిసి థాయ్ ప్రభుత్వ అధికారులు, అందుబాటులో ఉన్న రెస్క్యూ టీం తో అక్కడికి చేరుకుంటారు. గుహ లోపల కిలోమీటర్ల మేర నీరు నిండి ఉండటంతో సాధారణ డైవర్ల వల్ల కాదని తెలిసి, బ్రిటన్కు చెందిన సీనియర్ కేవ్ డైవర్లను పిలిపిస్తారు. వాళ్ళు ప్రాణాలకు తెగించి చీకటిగా, ఇరుకుగా ఉన్న నీటి మార్గాల గుండా వెళ్లి, పది రోజుల తర్వాత ఆ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని కనిపెడతారు. అయితే అసలు సవాల్ అప్పుడే మొదలవుతుంది. వర్షాలు ఇంకా పడుతుండటంతో, నీటిలో ఈత రాని ఆ చిన్న పిల్లలను అంత దూరం నీటి అడుగున ప్రాణాలతో బయటకు తీసుకురావడం దాదాపు అసాధ్యమనిపిస్తుంది.
చివరికి వాళ్ళు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. పిల్లలకు అనస్థీషియా (మత్తు) ఇచ్చి, నిద్రలో ఉన్నప్పుడే డైవర్లు ఒక్కొక్కరిని జాగ్రత్తగా నీటి అడుగున మోసుకుంటూ బయటకు తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నా, వేరే దారి లేక ఆ రిస్క్ తీసుకుంటారు. వేలాది మంది వాలంటీర్లు, రెస్క్యూ టీమ్ పడ్డ కష్టానికి ఫలితంగా 13 మందినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఈ ఉత్కంఠభరితమైన పోరాటం ముగుస్తుంది.
Read Also : మెంటలెక్కించే మెడికల్ కాలేజీ ప్రేమ… స్నేహితుల సరదాకు కొంప కొల్లేరు… ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా