Revanth Reddy: హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు అత్యంత కోలాహలంగా జరిగాయి. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ చర్చలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు తమలోని కళాకారుడిని నిద్రలేపి అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఫుట్ బాల్ ఆటలో అద్భుతమైన ఆటతీరును కనబరిచినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకులు ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ తీరిక లేకుండా గడుపుతారని, కానీ మనిషి అన్నాక కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని ప్రతిభను కాలక్రమేణా మర్చిపోయారన్నారు. ఇలాంటి వేదికలు వారిలోని కళలను మళ్లీ తెరపైకి తెస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల సమయంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించే సంప్రదాయం ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత దానిని కొనసాగించకపోవడం విచారకరమని అన్నారు. ఈ ఏడాది కొందరు ఈ పోటీలను రాజకీయం చేసి బహిష్కరించారని, వచ్చే ఏడాది అయినా వారందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
ప్రజాప్రతినిధులు ప్రదర్శించే ఈ కళలు, క్రీడలు రాష్ట్రంలోని 50 లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లుతూ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు వ్యసనాలకు బానిసలుగా మారడం ఆందోళనకరమని, వారిని మళ్ళీ క్రీడలు, కళల వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. నాయకులు ఆదర్శంగా నిలిస్తే యువతలో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్లకు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా ఒక పటిష్టమైన క్రీడా పాలసీని తీసుకువచ్చామని వెల్లడించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను సుమారు రూ. 700 కోట్లతో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం రాజకీయాలే కాకుండా, సమాజానికి స్ఫూర్తినిచ్చే కళా, క్రీడా రంగాలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Read Also: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!