Ancient Desi Fridge: కాలంతో సంబంధం లేకుండా నిత్యం వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రిఫ్రిజిరేటర్లు ముందు వరుసలో ఉంటాయి. ఆహారపదార్థాలు, కూరగాయలు, పాలు, పండ్లు ఇలా దేనినైనా రోజుల తరబడి తాజాగా ఉంచడంలో ఫ్రిడ్జ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఇది పనిచేయాలంటే 24 గంటలు పవర్ తప్పనిసరి. దీంతో నెలాఖరుకు వచ్చేసరికి కరెంటు బిల్లు తడిచిమోపెడు అవుతుంటుంది. అయితే దీనికి చెక్ పెట్టే తాతాల కాలం నాటి టెక్నాలజీ ఒకటి దేశంలో ఉందని తెలుసా? కరెంట్తో పనే లేకుండా, పైసా ఖర్చు లేకుండా తీవ్రమైన ఎండలోనూ రోజుల తరబడి పాలు, పెరుగును ఫ్రెష్ గా దీని ద్వారా ఉంచుకోవచ్చు. రాజస్థాన్ లో పుట్టిన ఈ అద్భుతమైన సాంప్రదాయ ‘దేశీ ఫ్రిడ్జ్’ గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రతలు 45 నుండి 50 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. అంతటి భయంకరమైన వేడిలో కూడా పాలు విరిగిపోకుండా, పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండటానికి అక్కడి ప్రజలు పూర్వీకుల కాలం నాటి ఒక పద్ధతిని వాడుతున్నారు. దీనినే స్థానికంగా ‘దేశీ ఫ్రిడ్జ్’ లేదా ‘జీర్ పాట్’ (Zeer Pot) టెక్నిక్ అని పిలుస్తారు. దీనిని తయారు చేయడానికి ఎటువంటి మోటార్లు, వైర్లు అవసరం లేదు. కేవలం మట్టి పాత్రలు ఉంటే చాలు.
ఈ దేశీ ఫ్రిడ్జ్ నిర్మాణ శైలి పురాతనమైనదే అయినప్పటికీ దీని వెనుక సైన్స్ దాగుంది. దేశీయ ఫ్రిడ్జ్ తయారి కోసం రెండు మట్టి పాత్రలు లేదా కుండలు అవసరం అవుతాయి. ముందుగా ఒక పెద్ద మట్టి పాత్రను తీసుకొని దాని లోపల కొంచెం చిన్నగా ఉండే మరో మట్టి పాత్రను ఉంచుతారు. ఈ రెండు పాత్రల మధ్య మిగిలిన ఖాళీ స్థలాన్ని నది ఇసుకతో పూర్తిగా నింపేస్తారు. ఆ ఇసుక పొరపై రోజుకు రెండు మూడు సార్లు నీళ్లు చల్లుతూ, ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్త వహిస్తారు. మరోవైపు కుండ వెలుపలి భాగాన్ని గోనె సంచి లేదా కాటన్ గుడ్డతో కట్టి దానిని కూడా తడుపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కుండ లోపల పెట్టిన పాలు, పెరుగు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని రాజస్థాన్ ప్రజలు చెబుతున్నారు.
ఇది పూర్తిగా ఎవాపరేటివ్ కూలింగ్ (బాష్పీభవనం) వ్యవస్థపై పనిచేస్తుంది. ఇసుకలోని నీరు మట్టి పాత్ర గోడల ద్వారా నెమ్మదిగా ఆవిరైపోతూ చిన్న పాత్రలోని వేడిని అది బయటకు లాగేస్తుంది. ఫలితంగా లోపలి పాత్రలోని ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే దాదాపు 10 నుండి 15 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. ఫలితంగా లోపలి ఉన్న పాలు, పెరుగు.. ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు వీలుకు కలుగుతుంది. తాతల కాలం నాటి ఈ దేశీయ ఫ్రిడ్జ్.. చిన్నపాటి ఎయిర్ కూలర్ లాగా పనిచేయనుండటం విశేషం.
Also Read: షుగర్ వ్యాధి ఉంటే పాలు తాగవచ్చా? డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
ఈ చిన్న పాత్రలో పాలు, పెరుగుతో పాటు పచ్చి కూరగాయాలు, వెన్న వంటివి కూడా భద్రపరుచుకోవచ్చని స్థానిక రాజస్థాని ప్రజలు చెబుతున్నారు. బయట ఎండ దంచికొడుతున్నా ఈ లోపలి పాత్రలో పాలు కనీసం 2 నుండి 3 రోజుల పాటు అస్సలు విరిగిపోకుండా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో పెరుగు త్వరగా పుల్లబడకుండా, గడ్డ పెరుగులా తాజాగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు వడిలిపోకుండా వారం రోజుల పాటు పచ్చగా ఉంటాయని వివరిస్తున్నారు. ఫ్రిడ్జ్ ల కోసం వేలకు వేలు ఖర్చు చేసే బదులు.. రెండు మట్టి పాత్రలు తెచ్చుకుంటే.. క్షణాల్లోనే దేశీయ ఫ్రిడ్జ్ తయారైపోతుందని సూచిస్తున్నారు. కరెంటు బిల్లు భారం కూడా తగ్గుతుందని హితవు పలుకుతున్నారు.
Also Read: జెన్నిఫర్ వింగెట్ పెళ్లి పీటలెక్కబోతుందా? సింగపూర్ బిజినెస్మెన్తో త్వరలోనే వివాహం!