భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే విషయం.. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. అయితే, భూమి ఎప్పుడూ నిర్ధిష్టమైన వేగంతో తిరగదు. పరిస్థితులను బట్టి.. వేగంగా లేదా నెమ్మదిగా తిరుగుతుంది. అయితే, ఈ మార్పును మనం అస్సలు గుర్తించలేం. వాస్తవానికి 2025 సంవత్సరంలో భూమి ఎన్నడూ లేనంత వేగంగా తిరిగిందట. ఇప్పుడిప్పుడే స్పీడు తగ్గించి.. మళ్లీ నెమ్మదిగా తిరగడం మొదలుపెట్టిందట. అయితే, ఈ ఆదివారం (జులై 26న) మాత్రం వేగంగా తిరిగేయనుందట. దీనివల్ల ఆ రోజు 24 గంటలు కంటే ముందే ముగియనుంది. అదెలా అనేగా మీ సందేహం?
ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్ సర్వీస్ (IERS) అందించిన తాజా సమాచారం ప్రకారం.. భూభ్రమణంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయి వేగంతో తిరిగిన భూమి.. ఇప్పుడు మళ్లీ తన వేగాన్ని తగ్గించుకోవడం ప్రారంభించింది. ఈ మార్పుల నేపథ్యంలో జులై 26న అత్యంత స్వల్పమైన రోజు నమోదు కానుంది. ఈ రోజు భూభ్రమణ సమయం సాధారణ 24 గంటలు కంటే దాదాపు 0.65 మిల్లీ సెకన్లు తక్కువగా ఉంటుంది. ఇది సెకనుకు వెయ్యో వంతు కంటే తక్కువ. కాబట్టి.. మనం ఈ తేడానను ఏమాత్రం గుర్తించలేం.
గత ఐదేళ్ల రికార్డులను పరిశీలిస్తే భూమి వేగంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా 2020లో అటామిక్ క్లాక్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన 28 రోజులు నమోదుయ్యాయి. 2025, జులై 10వ తేదీన అతి చిన్న రోజు నమోదైంది. ఆ రోజు 24 గంటల్లో 1.37 మిల్లీ సెకన్లు తగ్గాయట. దీనితో పోల్చితే.. జులై 26న నమోదయ్యే రికార్డు చిన్నదే. దీనికి రెండో స్థానం దక్కుతుంది. దీనికి కారణం.. 2025తో పోల్చితే 2026లో భూభ్రమణ వేగం కాస్త తగ్గడమే.
ప్రపంచ ప్రామాణిక సమయం (UTC) ఆధారం ఇప్పుడు మనం సమయ వేళలు పాటిస్తున్నాం. భూమి తన చుట్టూ తాను తిరిగే సమయానికి.. అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్ సమయానికి మధ్య తేడా రాకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు లీప్ సెకన్లు సరిచేస్తుంటారు. భూమి వేగంగా తిరిగినప్పుడు చిత్రలోనే తొలిసారి.. సమయం నుంచి ఒక సెకన్ తీసేసే పరిస్థితి రావచ్చని అంతా భావించారు. ఈ ప్రక్రియనే నెగటీవ్ లీప్ సెకండ్ అంటారు. అయితే ఇప్పుడు భూమి వేగం మళ్లీ నెమ్మదిస్తున్న నేపథ్యంలో నెగటివ్ లీప్ సెకన్ అవసరం ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
భూభ్రమణంలో వచ్చే మార్పులకు అనేక పరిస్థితులు కారణం కావచ్చు. ముఖ్యంగా ప్రకృతి సంబంధిత అంశాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. చంద్రుడు భూమధ్య రేఖకు సరిగ్గా పైభాగాన్న ఉన్నప్పుడు భూమి వేగం నెమ్మదిస్తుంది. చంద్రుడు ఉత్తర లేదా దక్షిణ దిశల్లో ఉన్నప్పుడు భూమి భ్రమణ వేగం పెరుగుతుంది. అయితే, సముద్ర కెరటాల మధ్య ఏర్పడే ఘర్షణ భూమి వేగాన్ని క్రమాన్ని తగ్గిస్తుంది. భూమి లోపల ద్రవ రూపంలో ఉండే లిక్విడ్ కోర్, సముద్రాలు, వాతావరణంలో జరిగే భౌతిక మార్పులు కూడా భూభ్రమణ వేగంపై ప్రభావం చూపుతాయి. గ్లేసియర్లు, ధ్రువ మంచు కరగడం వల్ల భూమిపై నీటి శాతం పెరుగుతుంది. దీనివల్ల రోజు నిడివి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఇటీవల వియన్నా విశ్వవిద్యాలయం, ఈటీహెచ్ జూరిచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Also Read: భూమి ఐదు సెకన్ల పాటూ తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకే భయపడుతున్నారు