Kannababu: విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శ్రీహరిపురంలో నిర్వహించిన ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’ అనే టౌన్ హాల్ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రస్తుత పాలనపై ఘాటైన విమర్శలు చేశారు.
హామీల ఉల్లంఘన – మోసపూరిత పాలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోలుమందం పాలన సాగిస్తోందని కన్నబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ముఖ్యంగా ‘మహాశక్తి’ పథకం కింద ప్రతి ఆడపిల్లకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పి, ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి, వాటిని సగం సగం అమలు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు.
పథకాల కోత – భూముల దారాదత్తం
ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ‘కోతల ప్రభుత్వం’గా కన్నబాబు అభివర్ణించారు. అమ్మ ఒడి (తల్లికి వందనం), పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ పేదల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ప్రజలకు ఇచ్చేందుకు నిధులు లేవంటూనే, మరోవైపు నారా లోకేష్ తోడల్లుడికి రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దారాదత్తం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
దారుణంగా ఆరోగ్య వ్యవస్థ
విశాఖలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రిలో కనీసం రోగులకు సరిపడా మందులు కూడా అందుబాటులో లేవని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు కానీ, విశాఖ బీచ్లో మాత్రం మద్యం షాపులను అందుబాటులోకి తెస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సిగ్గులేని పరిపాలన సాగిస్తోందని, ప్రజలు త్వరలోనే వీరికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read: విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!