BIG TV Immersive Technology: తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఆదరాభిమానాలు సంపాదించిన బిగ్ టీవీ న్యూస్ ఛానల్.. రీలాంచ్ రూపంలో తిరిగి ప్రజల ముందుకు వచ్చింది. అయితే మీడియాలో ఇన్నాళ్లు ప్రజలు చూస్తూ వస్తున్న వార్తా కథనాలకు భిన్నంగా ఇకపై బిగ్ టీవీలో ప్రసారాలు ఉండబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘ఇమ్మర్సివ్ టెక్నాలజీ’ (Immersive Technology). ఈ సాంకేతికతతో సమాచారాన్ని ఇచ్చే పద్దతి, ప్రజలు చూసే విధానం బిగ్ టీవీలో పూర్తిగా మారిపోనుంది. అయితే తెలుగు రాష్ట్రాలే గాక ఆసియాలోనే మెుట్టమెుదటి సారిగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న న్యూస్ ఛానెల్ బిగ్ టీవీనే కావడం విశేషం. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోల్లో ఒకటిగా బిగ్ టీవీ నిలిచింది. ఇంతకీ ఈ ఇమ్మర్సివ్ టెక్నాలజీ ఏంటి? దీని వల్ల వీక్షకులకు ఎలాంటి అనుభూతి కలగనుంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సాధారణంగా తెలుగు న్యూస్ ఛానళ్లలో మనం దృశ్యాలను చూస్తుంటాం. అయితే వార్త చూడటానికి, అందులో భాగం కావడానికి ఎంతో తేడా ఉంది. రొటిన్ కు భిన్నంగా వర్చువల్ గా ఘటనకు సంబంధించిన పరిసరాలను సృష్టించి.. వీక్షకులను పూర్తిగా ఆ వాతావరణంలోకి తీసుకెళ్లే సాంకేతికతనే ఇమ్మర్సివ్ టెక్నాలజీ అంటారు. అయితే ప్రస్తుతం బిగ్ టీవీ.. ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోను ఏర్పాటు చేసి.. ఈ ఇమ్మర్సివ్ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ప్రేక్షకులకు అందిస్తోంది.
వాస్తవానికి ఈ ఇమ్మర్సివ్ సాంకేతికత ఒక్కరోజులో వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల కృషి ఫలితంగా ఇది ఆవిష్కృతమైంది. ఈ సాంకేతికత ఆవిర్భావం గురించి షార్ట్ కట్ లో చెప్పుకోవాలంటే.. 1950ల ప్రారంభంలో మోర్టన్ హైలిగ్ అనే శాస్త్రవేత్త ‘సెన్సోరమా’ (Sensorama) అనే పరికరాన్ని తయారు చేశారు. ఇది త్రీడీ విజువల్స్, వాసన, గాలి వైబ్రేషన్లతో కూడిన తొలి ఇమ్మర్సివ్ అనుభూతిని అందించింది. 1960-80ల కాలంలో నాసా (NASA), మిలిటరీ వర్గాలు తమ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి వర్చువల్ సిమ్యులేటర్లను, హెడ్ మౌంటెడ్ డిస్ప్లేలను ఉపయోగించడం ప్రారంభించాయి. 2010 తర్వాత గేమింగ్ రంగంలో ‘ఒక్యులస్ రిఫ్ట్’ (Oculus Rift) రాకతో ఈ సాంకేతికత సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సినిమా రంగంలోనూ ఇమ్మర్సివ్ టెక్నాలజీని భారీ ఎత్తున వినియోగిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో ఒకప్పటి గ్రీన్ మ్యాట్స్ సంప్రదాయానికి స్వస్థి చెప్పి.. భారీ ఎల్ఈడీ వాల్స్ వాడుతున్నారు. అన్రియల్ ఇంజిన్ (Unreal Engine) సాయంతో ‘వర్చువల్ ప్రొడక్షన్’ ప్రారంభించడంతో ఈ సాంకేతికత మీడియా రంగానికి ప్రధాన అస్త్రంగా మారింది.
బిగ్ టీవీ ఉపయోగిస్తున్న ఈ అధునాతన సాంకేతికత ప్రత్యేకల విషయానికి వస్తే.. గ్రీన్ స్క్రీన్ల స్థానంలో నాణ్యత కలిగిన ఎల్.ఈ.డి తెరలతో నిజమైన వాతావరణాన్ని కెమెరా ముందే సృష్టిస్తారు. గేమింగ్ ఇంజిన్ల సహాయంతో లైటింగ్, స్టూడియో థీమ్, బ్యాక్గ్రౌండ్ను క్షణాల్లో మార్చేస్తారు. మరోవైపు కెమెరా కదిలే దిశకు అనుగుణంగా వెనుక ఉండే డిజిటల్ వాతావరణం కూడా నిజమైన ప్రదేశంలాగే యాంగిల్స్ మార్చుకోవడం దీనిలోని ప్రధాన అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.
ప్రస్తుతం బిగ్ టీవీ అందిపుచ్చుకున్న ఈ ఇమ్మర్సివ్ టెక్నాలజీ కారణంగా మన ఛానెల్లో వార్తా ప్రసారాలు నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయి. సాంప్రదాయకంగా ఉపయోగించే గ్రీన్ స్క్రీన్లు, ఫ్లాట్ డిజైన్ల స్థానంలో అత్యంత నాణ్యమైన త్రీడీ (3D) వాతావరణాన్ని క్షణాల్లో సృష్టించే వెసులుబాటు ఈ సాంకేతిక వల్ల లభిస్తోంది. ఫలితంగా రిపోర్టర్లు, కెమెరా టీమ్ ప్రతిసారీ ఘటన స్థలానికి వెళ్లకుండానే స్టూడియో నుంచే ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రదేశాన్నైనా, క్లిష్టమైన సన్నివేశాన్నైనా అత్యంత వాస్తవికంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు వీలు గలుగుతుంది. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు, తుఫాను తీవ్రత, ఆర్థిక గణాంకాలు వంటి సంక్లిష్టమైన డేటాను సాధారణ చార్ట్లలో కాకుండా గాల్లో తేలియాడే 3D గ్రాఫిక్స్ రూపంలో ప్రదర్శించడం వల్ల ప్రజలకు మరింత అర్థవంతంగా సమాచారం చేరుతుంది.
Also Read: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన
ఇన్నాళ్లూ న్యూస్ ను వినడం, చూడటం మాత్రమే చేసిన వీక్షకులు.. బిగ్ టీవీలో ఇకపై వార్తలను అనుభూతి చెందనున్నారు. న్యూస్ చదువుతున్నప్పుడు యాంకర్ పక్కనే ఆ వార్తకు సంబంధించి గ్రాఫిక్స్, డిజిటల్ దృశ్యాలు కొత్త అనుభూతిని పంచనున్నాయి. ఉదాహరణకు ఒక అంతరిక్ష ప్రయోగం (ఇస్రో ప్రాజెక్ట్) జరుగుతున్నప్పుడు రాకెట్ లోపలి భాగాలు, పనితీరును త్రీడీ మోడలింగ్ రూపంలో గాల్లో తేలుతున్నట్లు స్క్రీన్పై ప్రత్యక్షంగా చూడవచ్చు. మరోవైపు తుఫాను, భారీ వర్షాలకు సంబంధించిన వార్తను చూపిస్తున్నప్పుడు.. స్టూడియోలోకి నీరు వచ్చి చేరుతున్నట్లు, తుఫాను గాలులు వేగంగా వీస్తున్నట్లు వర్చువల్ ఎఫెక్ట్స్ క్రియేషన్ ద్వారా ప్రజలు వీక్షించనున్నారు.
Also Read: ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే పరువు తీసిన టిమ్ డేవిడ్