PRIMA Vision: కంటిచూపు కోల్పోయిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కీలక ముందడుగు పడింది. వయోభారం వల్ల వచ్చే దృష్టి లోపాన్ని తిరిగి రప్పించే ‘ప్రిమా’ (PRIMA) అనే పరికరాన్ని పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ.. ‘సైన్స్ కార్పొరేషన్’ (Science Corp) అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఐరోపా మెడికల్ డివైస్ రెగ్యులేటర్ దీని విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అనుమతులు సైతం మంజూరు చేసింది. అటు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ కూడా ఈ పరికరాన్ని సమీక్షించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడిన లక్షలాది మంది ఈ ‘మ్యాక్యులర్ డీజనరేషన్’ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కంటి వెనుక భాగంలో ఉండే కాంతిని గ్రహించే కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల పుస్తకాలు చదవడం, వ్యక్తుల ముఖాలను గుర్తుపట్టడం సాధ్యపడటం లేదు. అయితే ‘ప్రిమా పరికరం’ అమర్చుకున్న రోగులు మళ్లీ సాధారణంగా చదవగలుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రాన్స్కు చెందిన ఒక రోగి ఈ చిప్ సహాయంతో ఏకంగా 300 పేజీల నవలను చదివి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరొక పేషెంట్.. సుడోకు, క్రాస్వర్డ్ పజిల్స్ పూర్తి చేశారని తెలియజేస్తున్నారు.
ఈ పరికరాన్ని అమర్చడానికి రోగులకు ఒక గంట పాటు చికిత్స అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా కంటి వెనుక భాగంలో ఒక చిన్న మైక్రోచిప్ను అమరుస్తారు. దానికి అనుసంధానిస్తూ రోగులకు కెమెరాతో కూడిన ప్రత్యేక కళ్లజోడును అందిస్తారు. ఈ కళ్లజోడు దృశ్యాలను రికార్డు చేసి.. కంటిలోని చిప్కు డిజిటల్ సంకేతాల రూపంలో సమాచారాన్ని పంపుతుంది. తద్వారా కంటి ముందు ఉన్న వస్తువులను వృద్ధులు చూడగలుగుతారని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే సైన్స్ కార్పొరేషన్ సంస్థ సీఈఓ మాక్స్ హోడక్ గతంలో ఎలాన్ మస్క్కు చెందిన ‘న్యూరాలింక్’ సంస్థకు సహ-స్థాపకుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2021లో న్యూరాలింక్ నుండి బయటకు వచ్చిన హోడక్.. సిలికాన్ చిప్లు, జీవకణాల కలయికతో కొత్త తరహా బీసీఐ (బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్) పరికరాలను తయారుచేయడానికి.. సైన్స్ కార్పొరేషన్ను స్థాపించారు. ఈ క్రమంలోనే 2024లో ఫ్రాన్స్కు చెందిన ‘పిక్సియమ్’ కంపెనీని కొనుగోలు చేసి.. ఈ ‘ప్రిమా’ సాంకేతికతను వాణిజ్య స్థాయికి తీర్చిదిద్దారు.
Also Read: రైల్వేలో కొత్త రూల్.. టీసీలకు బాడీ కెమెరాలు.. తప్పు చేస్తే దొరికేస్తారు!
అయితే ఒక్కో ప్రిమా పరికరం ధర కొన్ని లక్షల డాలర్లు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఐరోపాలోని ఆరోగ్య సంరక్షణ సంస్థలతో ఇన్సూరెన్స్ రీ-ఇంబర్స్మెంట్ ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి జర్మనీలో మొదటి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో భవిష్యత్తులో మరింత అధునాతన బయో-హైబ్రిడ్ బ్రెయిన్ సెన్సార్లను, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) తరహా కళ్లజోళ్లను అభివృద్ధి చేయడమే తమ తుది లక్ష్యమని మాక్స్ హోడక్ తెలిపారు.
Also Read: రైళ్లలో సీట్ల కొరత తీరినట్లే.. త్వరలో 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్లు!