Astronauts : ఒకప్పుడు వృద్ధులకు కూడా కండరాల్లో చాలా బలం ఉండేది. ప్రాణాంతక వ్యాధి వస్తే తప్పా మంచానపడేవారు కాదు. కానీ ఇప్పటిరోజుల్లో అలా కాదు.. కాలుష్యం, ఆరోగ్య అలవాట్లు.. ఇవన్నీ మనిషిని తొందరగా బలహీనులను చేస్తున్నాయి. తక్కువ వయసులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కండరాలు అనేవి ఎక్కువ బలంగా ఉండడం లేదు. ఈ విభాగంలోనే యూకే శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టారు.
వైద్యరంగంలో ఏదైనా పరిశోధన చేయాలంటే.. దానికి తగిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. లేదా ఈ పరికరాలు కొనగలిగే అంత ఫండింగ్ అందుబాటులో ఉండాలి. అందుకే లివర్పుల్ సైంటిస్టులు కండరాలపై చేసే పరిశోధనల కోసం యూకే స్పేస్ ఏజెన్సీ అండగా నిలిచింది. స్పేస్లో ఆస్ట్రానాట్స్ కండరాల్లో జరిగే మార్పులు ఏంటో ఈ సైంటిస్టులు పరిశీలించనున్నారు. వారు భూమిపైకి తిరిగి రావడానికి ఆరు నెలల ముందు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేయనున్నారు.
2025 నుండి ఆస్ట్రానాట్స్ కండరాలపై పరిశోధనలు ప్రారంభం కానున్నాయి. మైక్రోఏజ్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే స్పేస్ ఏజెన్సీ నుండి పెట్టుబడి అందుకున్న శాస్త్రవేత్తలు.. రెండో విడతలో 1.4 మిలియన్ యూరోల పెట్టుబడిని అందుకున్నారు. స్పేస్లో ఉండే మైక్రోగ్రావిటీ వల్ల ఆస్ట్రానాట్స్ కండరాలు బలహీనంగా మరిపోతాయి. అంతే కాకుండా వారు భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో అవి మరింత బలహీనంగా ఉంటాయి. ఈ అంశాలపై శాస్త్రవేత్తల పరిశోధన జరగనుంది.
ముందుగా ల్యాబ్లో పెరిగిన ఒక కండరంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. మైక్రోగ్రావిటీ వల్ల దానిలో కలిగే మార్పులు ఏంటని పరిశీలించనున్నారు. ఆ కండరాన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ అవసరం అయినప్పుడు థెరపీని అందించడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు స్పేస్లో కండరాలపై పరిశోధనలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా జరిగాయి. కానీ వాటికి, వీటికి కొంచెం తేడా ఉంది.
మైక్రోఏజ్ 1 పేరుతో చేసిన పరిశోధనల్లో అసలు స్పేస్లో, మైక్రోగ్రావిటీలో కండరాలు అనేవి ఎలా ఏర్పడతాయని అనే కోణంలో పరిశోధనలు జరిగాయి. 2021 డిసెంబర్లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అవి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు మైక్రోఏజ్ 2 పేరుతో కండరాల బలాన్ని, బలహీనతను తెలుసుకోవడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి కూడా సక్సెస్ అవుతాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2025 వరకు ఈ పరిశోధనల యొక్క గ్రౌండ్ వర్క్ జరగనుంది.