India vs Pakistan Head-to-Head in ICC T20 World Cup 2024 Over the Years: మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని అంటారు. ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. కొత్తగా క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన అమెరికాపై గెలవలేక చతికిలపడింది. ఇప్పుడు సూపర్ 8 కి చేరాలంటే, ఇండియాపై గెలవక తప్పని పరిస్థితుల్లోకి వచ్చేసింది. అందుకే పాకిస్తాన్ మొండిగా తెగించి ఆడే అవకాశాలున్నాయని అంటున్నారు.
వారెప్పుడూ ఒత్తిడిలోనే అద్భుతంగా ఆడతారు. ఒక కసితోనే గెలుస్తుంటారు. నిజానికి యూఎస్ ఏ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి వారికి అదనపు బలాన్నిచ్చిందనే చెప్పాలి. టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ఐర్లాండ్ పై గెలిచి ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది. అయితే అది పసికూన జట్టు. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ పాకిస్తాన్ మ్యాచ్ పై పనికి రావని అంటున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ చావో రేవో అన్నట్టు ఆడుతుంది. ఎందుకంటే యూఎస్ఏపై ఓడిపోయినా వారి దేశంలో పెద్దగా ప్రకంపనలు రాలేదు. అదే ఇండియా పై ఓడిపోతే మాత్రం.. అమెరికా ఓటమిని పెద్దది చేసి చూపించి, పాక్ క్రికెటర్లను ఏకి పారేస్తారు. నిజానికి ప్రజల నుంచి వచ్చే నిరసనల సెగ నుంచి తట్టుకోవాలన్నా, వారు అమెరికా ఓటమిని మరవాలన్నా.. ఇండియాపై నెగ్గడం వారికి అనివార్యంగా మారింది.
Also Read: అందరి చూపు అటువైపే.. నేడే భారత్-పాకిస్తాన్ పోరు
అందుకని టీమ్ ఇండియా ఈ పిచ్ మీద కొంచెం జాగ్రత్తగా, ఓర్పుగా ఆడితే బాగుంటుందని అంటున్నారు. అయితే ఎన్నిరకాలుగా చూసినా పాకిస్తాన్ మీద టీమ్ ఇండియా రికార్డు మెరుగ్గా ఉంది. పరిస్థితులు, ఫామ్, రికార్డులు, జట్టులో బలాబలాలు ఇలా ఏ రకంగా చూసినా టీమ్ ఇండియా ఒక అడుగు ముందే ఉంది. కానీ క్రికెట్ లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేం.
బ్రహ్మాండంగా ఆడుతాడని అనుకునేవాడు ఒత్తిడిలో పడి డక్ అవుట్లు అయిపోతారు. ఏ అంచనాలు లేనివాళ్లు సంచలనాలు నమోదు చేస్తారు. మరి వర్షం వచ్చి మ్యాచ్ ఆగకపోతే మాత్రం ఎవరు హీరోలు అవుతారు? ఎవరు జీరోలు అవుతారనేది తేలిపోతుంది. కానీ రెండు జట్ల ఆటగాళ్లు మాత్రం తీవ్ర ఒత్తిడిలో మ్యాచ్ ఆడుతారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నిటికి మించి రెండు దేశాల ప్రజల భావోద్వేగాల మధ్యలో మ్యాచ్ జరుగనుంది. అందుకే ప్రపంచం అంతా నేటి మ్యాచ్ కోసం.. కళ్లార్పకుండా చూస్తోంది.