Hyderabad : హైదరాబాద్ లో భిన్నవాతావరణం నెలకొంది. ఉదయం ఎండ దంచేసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసుఫ్గూడ, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఫిలింనగర్, కూకట్ పల్లి ఏరియాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరంలో ఆదివారం ఉదయం భానుడు భగభగలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ మధ్యాహ్నం తర్వాత వరుణుడు రాకతో ఉపసమనం పొందారు. మరోవైపు వచ్చే 3 రోజులు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°సెంటీగ్రేడ్ నుంచి 43 ° సెంటీగ్రేడ్ వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38° సెంటీగ్రేడ్ నుంచి 41°సెంటీగ్రేడ్ వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇంకోవైపు దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రం నుంచి తేమ కారణంగా వాయువ్య భారతదేశంలో ఇదే విధమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. వచ్చే 5 రోజులపాటు వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి.