Ap Luxury Houseboats: ఏపీలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో గ్లాస్ బ్రిడ్జి, వండర్ లా లాంటి ప్రాజెక్టును తీసుకురాగా, కడపలోని గండికోటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ ట్రయల్ రన్స్ కూడా కొనసాగాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కృష్ణా నదిపై కేరళ తరహా లగ్జరీ హౌస్బోట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. టూరిజం పాలసీలో భాగంగా, ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి స్థానిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆపరేటర్ల సహకారంతో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
లగ్జరీ హౌస్ బోట్లకు సంబంధించి ప్రభుత్వం గత డిసెంబర్ 2025లో నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఫేజ్ లో సుమారు 20 లగ్జరీ హౌస్బోట్లను అందుబాటలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇవి కేరళ బ్యాక్ వాటర్ హౌస్ బోట్ల మాదిరిగా డిజైన్ చేయబడుతాయి. సాంప్రదాయ శైలి, ఆధునిక సౌకర్యాల కలయికతో వీటిని తయారు చేయనున్నారు. లీజర్ క్రూస్లు, ఓవర్ నైట్ స్టేలు, స్థానిక వంటకాలు , వినోద సదుపాయాలతో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
ఈ లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడలోని బెర్మ్ పార్క్ తో పాటు కృష్ణా నది పరిసరాల్లో అందుబాటు ఉంచనున్నారు. అటు సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్స్ లో కూడా 5 అల్ట్రా లగ్జరీ బోట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బోట్లు 2026 అక్టోబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది భవానీ ఐలాండ్, ప్రకాశం బ్యారేజ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో టూరిజంను పెంచేలా డెవలప్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇలాంటి హౌస్ బోట్లు కేవలం కేరళలో మాత్రమే ఉన్నాయి. చాలా మంది వీటిని ఎంజాయ్ చేసేందుకు కేరళకు వెళ్తారు. కానీ, ఇకపై కేరళకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీలోనే లగ్జరీ బోట్లను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. వీటి ద్వారా స్థానికంగా ఉద్యోగాలను క్రియేట్ చేయడంతో పాటు టూరిజం ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో రోప్ వే, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, సీప్లేన్ సర్వీసులు, అమరావతిలో మరీనా వాటర్ ఫ్రంట్ జెట్టీలు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్డ్ స్పేసులు కూడా ప్లాన్ చేస్తున్నారు. వాటికి లగ్జరీ హౌస్ బోట్లు తోడు కాబోతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు ఇంకా ప్రారంభంలోనే ఉంది. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత నిర్మాణం, అందుబాటులోకి వచ్చే సమయం సహా పలు వివరాలు వెల్లడికానున్నాయి. అధికారులు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also: IRCTC దుబాయ్ టూర్, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి గురూ!