Supreme Court On ‘Second Class Passenger’: రైళ్లలో పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు వెంటనే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భారతీయ రైల్వేను ఆదేశించింది. కిక్కిరిసిన బోగీల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రయాణికులు కదులుతున్న రైళ్ల నుంచి జారి పడుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2015లో నడుస్తున్న రైలు నుంచి పడిపోయి మరణించిన ఓ వ్యక్తి భార్య దాఖలు చేసిన అప్పీల్ను విచారించే సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం, ప్రమాద సమయంలో బాధితుడి వద్ద టికెట్ లేకపోవడం మాత్రమే కారణంగా అతని కుటుంబానికి పరిహారం నిరాకరించడం సరికాదని స్పష్టం చేసింది. బాధితుడి కుటుంబానికి రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రైల్వేను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా రైళ్లలో అధిక రద్దీ కారణంగా జరిగే ప్రమాదాలు కొత్త విషయం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం రైల్వే ప్రయాణాలతో పోలిస్తే ఇటువంటి ప్రమాదాల సంఖ్య తక్కువగా కనిపించినా, ప్రతి ప్రమాదం ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగులుస్తుందని తెలిపింది. మహాకుంభమేళా సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట, అలాగే 2025లో ముంబై లోకల్ రైళ్లలో రద్దీ కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనలను కూడా కోర్టు ప్రస్తావించింది.
రైల్వే కమర్షియల్ మాన్యువల్ను పరిశీలించిన ధర్మాసనం, రద్దీని నియంత్రించేందుకు ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని గుర్తించింది. ప్రయాణికులను కోచ్లలో సమంగా పంపిణీ చేయడం, అవసరమైనప్పుడు అదనపు బోగీలు జోడించడం, స్టేషన్ మాస్టర్లు, గార్డులు, టికెట్ ఇన్స్పెక్టర్లు సమన్వయంతో పనిచేయడం వంటి మార్గదర్శకాలు అందులో ఉన్నాయని తెలిపింది. అయితే సమస్య నిబంధనల్లో లేదని, వాటి అమలులోనే లోపం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని మార్చాలంటే రైల్వేలో మరింత మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రైల్వే ఆధునీకరణ కొనసాగుతున్న ఈ సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా భద్రతను కూడా మెరుగుపర్చవచ్చని సూచించింది. అదే సమయంలో ప్రయాణికులు కూడా తమ భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, అన్ని తప్పులను రైల్వేలపైనే మోపడం సరైంది కాదని తెలిపింది.
అటు రైల్వే మాన్యువల్లో ఉపయోగిస్తున్న ‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ అనే పదాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అది టికెట్ తరగతిని సూచించినప్పటికీ, భారత సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే అలాంటి పదజాలం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉండదని వ్యాఖ్యానించింది. చివరగా, బాధితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలాన్ని నమ్మిన సుప్రీంకోర్టు, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గత తీర్పులను రద్దు చేసింది. నాలుగు వారాల్లోగా బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని, గడువులోపు చెల్లించకపోతే ఏడాదికి 8 శాతం వడ్డీతో చెల్లించాలని రైల్వేకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Read Also: బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?