Himalayan Diamond Flower: హిమాలయాల్లో సముద్ర మట్టానికి దాదాపు 4,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో, అత్యంత శీతల వాతావరణంలో పూచే ఒక అరుదైన పువ్వు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానికంగా ‘కెంజో’ లేదా ‘పదంఛాల్’ అని పిలిచే ఈ మొక్క మనిషి కంటే ఎత్తుగా, దాదాపు రెండు మీటర్ల వరకు పెరుగుతుంది. ఎంతో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పెరిగే ఈ మొక్క.. 7 నుంచి 15 ఏళ్ల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే పూస్తుంది.
ఈ పువ్వుకు కేవలం దాని ప్రత్యేకత వల్లే కాకుండా.. ఆ తీవ్రమైన చలి, ఈదురు గాలులు, అతినీలలోహిత కిరణాలను తట్టుకుని నిలబడే శక్తి ఉన్నందున ‘హిమాలయన్ డైమండ్’ అనే పేరు వచ్చింది. హిమాలయాల మంచు ప్రాంతాల్లో మిలమిలా మెరిసే ఈ పువ్వును ప్రత్యక్షంగా చూడటం ట్రెక్కింగ్ చేసేవారికి, పరిశోధకులకు ఒక గొప్ప అనుభూతి.
ఈ వింత పూలను చూడాలంటే ఉత్తరాఖండ్లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమ్కుండ్ సాహిబ్, గంగోత్రి నేషనల్ పార్క్ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు నార్త్ సిక్కింలోని యుమ్థాంగ్, జీరో పాయింట్ ప్రాంతాలలో, అలాగే భూటాన్లోని జోమోల్హరి పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
Also Read: ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!
హిమాలయాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే కఠిన వాతావరణంలో ఇవి బతకడానికి ఒక వింత నిర్మాణం దోహదపడుతుంది. వీటి పూల చుట్టూ ఉండే రెక్కలు ఒక రకమైన గ్రీన్హౌస్ వాతావరణాన్ని సృష్టించి, లోపల ఉన్న పూలకు వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ సహజ రక్షణ వల్లే ఇవి అక్కడ సులభంగా పెరగగలుగుతున్నాయి.
తరతరాలుగా స్థానిక వైద్యంలో ఈ పదంఛాల్ పూలకు ప్రత్యేక స్థానం ఉంది. గాయాలు, దెబ్బలు మానడానికి, ఎముకల విరిగిన వాళ్లకు, తలనొప్పి, కడుపులో ఉబ్బరం, నొప్పులు తగ్గేందుకు దీనిని ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం పర్యావరణ మార్పుల వల్ల ఈ జాతి ఉనికి ప్రమాదంలో పడుతోంది.
ఈ అందమైన పువ్వులను చూడటానికి జులై చివరి నుంచి సెప్టెంబర్ ప్రారంభం వరకు సరైన సమయం. అయితే ఇవి చాలా ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి.. ట్రెక్కింగ్ వెళ్లేవారు వాతావరణానికి అలవాటు పడటం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతాన్ని కోయకుండా, కేవలం చూసి ఆస్వాదించడం మన బాధ్యత.
Also Read: ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్తో ఇలా చెక్ పెట్టండి!