IndiGo voucher: ప్రయాణీకుల నమ్మకం, భద్రతకు మారుపేరుగా నిలిచే ఇండిగో ఎయిర్లైన్స్ ఈ డిసెంబర్ తొలి వారంలో అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య సిబ్బంది కొరత, ఎయిర్ పోర్టులలో అనూహ్య రద్దీ కారణంగా అనేక విమానాలు రద్దు కావడం, ఆలస్యం అవడంతో వేలాది మంది ప్రయాణీకులు గంటల తరబడి ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ కార్యాచరణ వైఫల్యాన్ని అంగీకరిస్తూ.. తమ కస్టమర్లకు ఊరట కల్పించడానికి ఇండిగో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణీకులకు రూ. 10వేల విలువైన ట్రావెల్ వోచర్ను అందిస్తున్నట్లు తెలియజేసింది.
సంక్షోభానికి కారణాలు, సంస్థ స్పందన:
ఈ మూడు రోజుల పాటు కొనసాగిన విమాన రద్దులు, ఆలస్యాల వెనుక ప్రధానంగా సిబ్బంది కొరత సమస్య ఉందని ఇండిగో పరోక్షంగా అంగీకరించింది. ఈ ఊహించని పరిణామం కారణంగా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్లైన్ విచారం వ్యక్తం చేసింది.
రూ. 10,000 వోచర్ వివరాలు:
డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించి,ఎయిర్ పోర్టులలో ఎక్కువ గంటలు చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులు పడిన కస్టమర్లకు ఈ వోచర్ను అందిస్తున్నారు. ఈ రూ. 1 వేల విలువైన వోచర్లను ప్రయాణీకులు రాబోయే 12 నెలల కాలంలో ఇండిగో విమానాల్లో భవిష్యత్తులో చేసే ప్రయాణాల కోసం ఉపయోగించుకోవచ్చు.
అదనపు పరిహారంగా వోచర్:
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ వోచర్ అనేది ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి అదనంగా ఇవ్వబడుతోంది. పౌర విమానయాన నియమాల ప్రకారం.. ఎయిర్లైన్ విమానం బయలుదేరే సమయాన్ని బట్టి, రద్దు చేయబడిన విమానాలకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పరిహారం ఇవ్వాలి. ఇండిగో సంస్థ ఆ చట్టబద్ధమైన పరిహారాన్ని అందిస్తూనే.. కస్టమర్ల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రత్యేక వోచర్ను ప్రకటించింది.
Also Read: రామ్ ఆలయం నుంచి రామనాథస్వామి వరకు.. జీవితంలో ఒక్కసారి తప్పక చేయాల్సిన యాత్ర
రీఫండ్ వేగవంతం, కస్టమర్లకు సూచన:
రద్దు చేసిన విమానాలకు సంబంధించిన రీఫండ్ల ప్రక్రియ ఇప్పటికే వేగవంతం అయింది. చాలా మంది కస్టమర్ల ఖాతాల్లో ఈ డబ్బు తిరిగి జమ అయిందని, మిగిలిన లావాదేవీలు కూడా త్వరలో పూర్తవుతాయని సంస్థ వెల్లడించింది.
అంతేకాకుండా.. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా లేదా ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ల చర్యలు ప్రారంభమయ్యాయి. సంస్థ వద్ద లేని కస్టమర్లు ఆలస్యం చేయకుండా customer.experience@goindigo.in కు ఇమెయిల్ పంపాలని ఇండిగో కోరింది. తద్వారా వోచర్లు, రీఫండ్ల పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని వెల్లడించింది.