జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ పహల్గామ్. ఈ అందమైన ప్రాంతానికి పర్యాటకులకు వస్తూనే ఉంటారు. కానీ 2025లో జరిగిన ఉగ్రదాడి కారణంగా కొన్ని నెలల పాటు ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. భద్రతా కారణాలతో పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో అధికారులు పహల్గామ్ పరిసరాల్లోని 14 ప్రముఖ లోయలు, పార్కులు, ప్రకృతి ప్రాంతాలను తిరిగి తెరిచారు. దీంతో పర్యాటకులు మళ్లీ రావచ్చని ప్రకటించారు.
ఉగ్రదాడి తరువాత మూసివేత
పహల్గామ్.. జమ్మూ కాశ్మీర్లో అత్యంత అందమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటి. మంచుతో కప్పిన కొండలు, పచ్చని మైదానాలు, ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రతి సంవత్సరం దేశీ,విదేశీ పర్యాటకులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కానీ 2025లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భద్రతా ఆందోళనల కారణంగా పర్యాటకుల రాక తగ్గిపోయింది. కొంతమంది టూర్లను రద్దు చేసుకున్నారు. స్థానిక వ్యాపారాలు కూడా మూతబడిపోయాయి. ఇప్పుడు భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షించి అదనపు ఏర్పాట్లు చేసిన తర్వాత పర్యాటకులకు మళ్లీ అనుమతి ఇచ్చారు. అధికారుల ప్రకటన ప్రకారం పహల్గామ్ పరిసరాల్లోని 14 ముఖ్య ప్రదేశాలు తిరిగి తెరుచుకున్నాయి. అందులో బెటాబ్ వ్యాలీ, అరు వ్యాలీ, చందన్వారి, బైసరన్ వ్యాలీ, తులియన్ సరస్సు వంటి ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రదేశాలు కావడంతో వీటి తెరవడం పర్యాటకులకు సంతోషకరంగా మారింది.
Also read: AC tips: వేసవి మొదలైపోయింది.. ఏసీ ఆన్ చేయడానికి ముందు ఈ 5 పనులు తప్పకుండా చేయాలి
బెటాబ్ వ్యాలీ పచ్చని మైదానాలు, మంచు కొండలతో నిండి ఉంటుంది. సినిమా షూటింగ్లకు కూడా ఇది అనువైనది. అరు వ్యాలీ ట్రెక్కింగ్, క్యాంపింగ్కు చక్కగా ఉంటుంది. బైసరన్ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. చందన్వారి అమర్నాథ్ యాత్ర మార్గంలో ముఖ్యమైన స్టాప్. తులియన్ సరస్సు ఎత్తైన ప్రాంతంలో ఉండి ట్రెక్కర్లకు ప్రత్యేక అనుభవాలను ఇస్తుంది. అలాగే కొలాహోయ్ గ్లేసియర్, శేషనాగ్ సరస్సు, లిడర్ వ్యాలీ వంటి ప్రకృతి ప్రాంతాలు కూడా తిరిగి తెరుచుకున్నాయి. మామలేశ్వర్ ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా పర్యాటకులు వెళ్లవచ్చు. పహల్గామ్ గోల్ఫ్ కోర్స్, దబియన్ పార్క్ వంటి కుటుంబంతో వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కనిమార్గ్, బ్రారి మార్గ్ వంటి ప్రశాంత ప్రాంతాలు నేచర్ వాక్స్కు అనువుగా ఉంటాయి.
ప్రత్యేక భద్రత
పర్యాటకుల భద్రత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి ప్రాంతంలో పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణ పెంచారు. ప్రవేశ ద్వారాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పర్యాటకులకు మార్గదర్శకాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు హెల్ప్లైన్ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. టూర్ ఆపరేటర్లతో కూడా సమన్వయం చేసి భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
పహల్గామ్ ప్రాంతం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టాక్సీ డ్రైవర్లు, గైడ్లు, స్థానిక వ్యాపారులు అందరూ ఈ రంగంపై ఆధారపడే జీవిస్తారు. కానీ ఇన్నాళ్లుగా ఈ ప్రదేశాలు మూసివేయడంతో వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు తిరిగి తెరుచుకోవడంతో వారు ఆనందపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది పర్యాటకులు తిరిగి రావడం ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. ఉగ్రదాడి తర్వాత కొంతకాలం మూసివేసిన పహల్గామ్ పర్యాటక ప్రదేశాలు ఇప్పుడు మళ్లీ తెరుచుకోవడం పర్యాటకులకు ఆనందాన్నే ఇస్తుంది.భద్రతా చర్యల మధ్య పర్యాటకులను స్వాగతించేందుకు ప్రాంతం సిద్ధమవుతోంది.