IRCTC Circular Journey Ticket 2026: భారతీయ రైల్వే ప్రయాణం ఇప్పటికీ అత్యంత చౌకగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే అందిస్తున్న సర్క్యులర్ జర్నీ టికెట్ ప్రయాణికులకు మరింత లాభదాయకంగా మారింది. ఒకే టికెట్తో అనేక ప్రాంతాలు సందర్శించే అవకాశం లభిస్తోంది.
ఒకే ప్రయాణంలో అనేక నగరాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించి, చివరకు తిరిగి బయలుదేరిన స్టేషన్కే చేరుకునే ప్రయాణానికి ఈ ప్రత్యేక టికెట్ను ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా విడివిడిగా టికెట్లు తీసుకోవడం కంటే.. ఇది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ టికెట్తో ప్రయాణం ప్రారంభించిన రోజు నుంచి గరిష్టంగా 56 రోజుల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ గడువులో మీరు పలు ప్రాంతాలు సందర్శించి చివరకు మొదట బయలుదేరిన రైల్వే స్టేషన్కే తిరిగి చేరుకోవాలి. సుమారు రెండు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అనుకున్న ప్రాంతాలన్నీ తీరికగా చుట్టేసి రావచ్చు.
సర్క్యులర్ జర్నీ టికెట్లో మరో ముఖ్యమైన సౌకర్యం మధ్య లో బ్రేక్లు తీసుకునే అవకాశం. మొత్తం ప్రయాణంలో గరిష్టంగా ఎనిమిది చోట్ల దిగవచ్చు. అక్కడ కొన్ని రోజులు గడిపి, ఆ ప్రాంతంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి మళ్లీ అదే టికెట్తో ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ టికెట్ ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే వారికి, ఒకేసారి పలు పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునే వారికి, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం తరచూ వివిధ నగరాలకు వెళ్లేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. విడివిడిగా టికెట్లు బుక్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాన్ తో మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.
సర్క్యులర్ జర్నీ టికెట్ ను సాధారణ రైలు టికెట్లా ఆన్లైన్లో వెంటనే బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ముందుగా మీ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకుని సంబంధిత రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలి. మీరు ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు ప్రయాణిస్తారు? ఎన్ని బ్రేక్లు తీసుకుంటారు? అనే వివరాల ఆధారంగా టికెట్ ధరను నిర్ణయిస్తారు. ఆ తర్వాత మీరు ప్రయాణం ప్రారంభించే రైల్వే స్టేషన్లో ఈ టికెట్ ఇస్తారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన క్లాస్ను కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సాధారణంగా ఒక్కో నగరానికి విడిగా టికెట్లు బుక్ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ, సర్క్యులర్ జర్నీ టికెట్తో అదే ప్రయాణాన్ని తక్కువ ఖర్చులో పూర్తి చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం వర్తించే రాయితీలు కూడా లభిస్తుంది. దేశంలోని పలు నగరాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్లో సందర్శించాలనుకునే వారికి సర్క్యులర్ జర్నీ టికెట్ నిజంగా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!