Passport Colors: ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు తమ పౌరులకు అందించే పాస్పోర్ట్లు ప్రధానంగా నాలుగు రంగుల్లోనే ఉంటాయి. అవి బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్. అయితే ఒక దేశం నిర్దిష్ట రంగు పాస్పోర్ట్ను ఎంచుకోవడం వెనుక భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన కారణాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఆ పాస్ పోర్ట్ రంగుల ప్రాముఖ్యత ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమెరికా పౌరుల చేతుల్లో కనిపించే పాస్పోర్ట్ రంగు బ్లూ. సాధారణంగా ఈ రంగు పాస్ పోర్ట్ ను ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలోని దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. దక్షిణ అమెరికాలోని మెజారిటీ దేశాలు, కరేబియన్ దీవులు, అమెరికా ఆధీనంలోని ప్రాంతాలు బ్లూ కలర్ పాస్పోర్ట్లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని అంతర్జాతీయ ఆర్థిక కూటమిలలో సభ్యత్వానికి కూడా ఇది సంకేతంగా నిలుస్తుంది. అయితే అమెరికా ఖండాలకు చెందినవి కాకపోయినా ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు కూడా ఈ బ్లూ పాస్పోర్ట్నే ఉపయోగిస్తుండటం గమనార్హం.
ఎరుపు రంగు పాస్పోర్ట్లు కూడా ఆయా దేశాల ఆర్థిక, రాజకీయ కూటముల స్థితిని తెలియజేస్తాయి. ఉదాహరణకు, యూరోపియన్ యూనియన్ (EU) లోని అన్ని సభ్య దేశాలు ముదురు ఎరుపు రంగు పాస్పోర్ట్లనే వాడతాయి. అయితే ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమించిన తర్వాత బ్రిటన్ తన పాస్ పోర్ట్ రంగును బ్లూకి మార్చుకుంది. అలాగే యూరోపియన్ యూనియన్లో చేరాలని భావిస్తున్న టర్కీ కూడా తన పాస్పోర్ట్ను ఎరుపు రంగులోకి మార్చింది. మరోవైపు స్విట్జర్లాండ్ తన జాతీయ పతాకంలో ఉండే ఎరుపు రంగుకు మ్యాచ్ అయ్యేలా రెడ్ పాస్పోర్ట్ను ఉపయోగిస్తోంది.
సాధారణంగా పచ్చ రంగు (గ్రీన్)ను ఇస్లాం మతంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే సౌదీ అరేబియా, ఈజిప్ట్, పాకిస్తాన్, మొరాకో వంటి అనేక ముస్లిం మెజారిటీ దేశాలు.. అలాగే కొన్ని ఆఫ్రికా దేశాలు ఆకుపచ్చ రంగు పాస్పోర్ట్లను ఎంచుకున్నాయి. అయితే మతపరమైన కారణాలే కాకుండా ఇతర ఆర్థిక, ప్రాంతీయ ప్రాముఖ్యతల ఆధారంగా మెక్సికో, వాటికన్ సిటీ, తైవాన్ వంటి దేశాలు కూడా పచ్చ రంగు పాస్పోర్ట్లనే ఉపయోగిస్తున్నాయి.
పాస్పోర్ట్ రంగుల్లో నలుపు అనేది అత్యంత అరుదుగా కనిపిస్తుంది. అంగోలా, మలావి, కాంగో, పాలస్తీనా ప్రాంతాలు.. ట్రినిడాడ్ & టొబాగో, తజికిస్తాన్ వంటి దేశాలు నల్లటి పాస్పోర్ట్లను ఉపయోగిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. నలుపు వారి జాతీయ రంగు కావడంతో వారు నల్ల రంగు పాస్పోర్ట్కే ప్రాధాన్యత ఇచ్చారు.
Also Read: విశాఖ రైల్వే స్టేషన్కు మహర్దశ.. ఎయిర్పోర్ట్ రేంజ్ సౌకర్యాలు.. 6 కొత్త ప్లాట్ఫామ్లు!
భారత్ తన పౌరుల అవసరాలు, హోదాలను బట్టి ప్రధానంగా నాలుగు రంగుల పాస్పోర్ట్లను జారీ చేస్తోంది. సాధారణ ప్రజలకు నీలిరంగు (బ్లూ) పాస్పోర్ట్ అందిస్తున్నారు. దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులకు మెరూన్ (రెడ్) రంగులో ఉండే డిప్లొమాటిక్ పాస్పోర్ట్.. అలాగే ప్రభుత్వ అధికారిక పనులపై విదేశాలకు వెళ్లే అధికారులకు తెలుపు (వైట్) రంగు పాస్పోర్ట్ కేటాయిస్తారు. ఇవి కాకుండా ఇమిగ్రేషన్ తనిఖీలు అవసరం లేని ఈసిఆర్ఓ (ECRO) కేటగిరీ పౌరుల కోసం నారింజ (ఆరెంజ్) రంగు పాస్పోర్ట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రంగుల ద్వారా విదేశీ విమానాశ్రయాల్లో భారత్ కు చెందిన సదరు ప్రయాణికుడి ప్రాధాన్యతను గుర్తించనున్నారు.
Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్లోనే లైవ్ టీవీ!