Mahalakshmi Smart Cards: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి విశేష ఆదరణ లభిస్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా ‘మహాలక్ష్మీ పథకం’ పేరుతో ప్రభుత్వం ఈ దీనిని అమలు చేస్తోంది. 2023 డిసెంబర్ 9న అధికారికంగా ఈ ఫ్రీ బస్ సర్వీసు అమల్లోకి రాగా.. అప్పటి నుంచి రాష్ట్రంలోని మహిళలు రూపాయి చెల్లించకుండానే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆధార్ కార్డు గుర్తింపుతో జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు తీసుకొని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. నకిలీ గుర్తింపు కార్డులతో ప్రయాణించేవారికి చెక్ పెట్టేందుకు.. ఈ స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు స్మార్ట్ కార్డుల నమూనాను ఆర్టీసీ సిద్ధం చేయగా.. వీటిలో ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుంది.
స్మార్ట్ కార్డులను చిప్ ఆధారిత టెక్నాలజీతో తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. కార్డులోని చిప్ లో లబ్దిదారుల పేర్లు, అడ్రస్, వాళ్లకు కేటాయించిన ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్ నిక్షిప్తమై ఉంటుంది. దీనిని చూపించడం లేదా టికెట్ మిషన్ కు స్వైప్ చేయడం ద్వారా కండెక్టర్ టికెట్ ను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ కార్డు పొందేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అవలంభిస్తారన్న దానిపై త్వరలోనే క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.
మహాలక్ష్మి పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు.. నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించుకొని బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అలాంటి వారికి ఈ స్మార్ట్ కార్డుల ద్వారా చెక్ పెట్టి… నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో టికెట్ జారీ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Also Read: Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అయితే దంచుడే దంచుడు, పిడుగులు పడే ఛాన్స్
మహిళలకు అందించే స్మార్ట్ కార్డులు ట్రాకింగ్ చిప్స్ గానూ పనిచేయనున్నాయి. దీని వల్ల స్త్రీల రద్దీ అధికంగా ఉన్న మార్గాలను గుర్తించేందుకు వీలు పడుతుంది. తద్వారా రద్దీ తక్కువగా ఉన్న రూట్ల నుంచి ఆ మార్గాల్లోకి బస్సులను మళ్లించి స్త్రీల ప్రయాణాన్ని సులభతరం చేయవచ్చు. అదే విధంగా మహిళలు ఏ స్థాయిలో మహాలక్ష్మీ పథకాన్ని వినియోగిస్తున్నారో ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి కచ్చితమైన డేటా అందనుంది.
Also Read: Anjali: ఫిలింఫేర్ అవార్డ్స్ వల్ల హీరోయిన్ అంజలికి అసహనం.. ఏమైందంటే!