AP National Observer: అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి.అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జాతీయ అబ్జర్వర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అదిత స్వప్న బీహార్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులకు జాతీయ పరిశీలకురాలిగా విజయవంతంగా పని చేసిన విషయం తెలిసిందే.
తనను అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా నియమించడంపై అదితా స్వప్న స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాపై విశ్వాసం ఉంచి, నూతన బాధ్యతను అప్పగించినందుకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’ అని అన్నారు.
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా నాయకత్వంలో.. ఆంధ్రప్రదేశ్లో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి, అలాగే రాహుల్ గాంధీ దార్శనికత, నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదిత స్వప్న తెలిపారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ను రాష్ట్రంలోని ప్రతి మండలం, బూత్ స్థాయికి తీసుకెళ్తానని, ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళా కాంగ్రెస్ ఉనికిని విస్తరించడంపై దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు. అలాగే మహిళా నాయకులకు సాధికారత కల్పించడం, సంస్థాగత చట్రాన్ని బలోపేతం చేయడం, రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం అఖిల భారత మహిళా కాంగ్రెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని ఈ సందర్భంగా అదిత స్వప్న తెలిపారు.