AP Weather: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ అందించింది. వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం ఒక బలమైన అల్పపీడనం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఏర్పడిన ఈ రెండో అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో రుతుపవనాల కదలికల్లో మార్పులు వస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండు రోజుల పాటు అలర్ట్!
ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలకు కాస్త ఉపశమనం లభించనుంది. గురు, శుక్రవారాల్లో ఈ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు దూసుకుపోనుంది. ఆ తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుండటంతో దేశంలోని తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పుంజుకునే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మండుతున్న ఎండలు
ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ఉపశమనం లభించేలా లేదు. ఈ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం దాదాపు శూన్యమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల రానున్న ఆరేడు రోజుల పాటు ఇక్కడ పొడి వాతావరణమే ఉంటుంది. భానుడి భగభగలు, వేడి గాలుల తీవ్రత యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. ఉడికిపోతున్న ప్రధాన నగరాలు
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని వణికిస్తున్నాయి. బుధవారం నాటి లెక్కల ప్రకారం బాపట్లలో 41.1°C, జంగమహేశ్వరపురంలో 41°C, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో 40.6°C మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తా, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. గురువారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఖరీఫ్ సాగుపై ఎండల దెబ్బ.. ఆందోళనలో అన్నదాతలు
రాష్ట్రంలో గత రెండు వారాలుగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ సకాలంలో వర్షాలు పడకపోవడంతో విత్తనాలు నాటే ప్రక్రియ మందగించింది. ఇప్పుడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో వారం రోజుల పాటు పొడి వాతావరణం, వర్షాభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాల కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది.
Also Read: నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?