Kanipakam Hundi: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు తమ మొక్కులను పెద్ద ఎత్తున సమర్పించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గత 22 రోజులకు గాను ఆలయ హుండీలను అధికారులు శాస్త్రోక్తంగా లెక్కించారు. విరాళాలు, కానుకల రూపంలో దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది.
గత 22 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా.. స్వామివారికి నగదు రూపంలో ఏకంగా రూ. 1,83,98,379 (ఒక కోటి 83 లక్షల 98 వేల 379 రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సైతం కానుకల రూపంలో సమర్పించారు. 22 రోజుల వ్యవధిలో దేవస్థానానికి 49 గ్రాముల బంగారం, 640 గ్రాముల వెండిని కానుకల రూపంలో భక్తులు అందజేశారు.
ఆలయంలో సాగే సేవా కార్యక్రమాలకు కూడా భక్తులు తమ వంతు సాయాన్ని అందించారు. స్వామివారి నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.2,20,830 లభించాయి. గోవుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన గో సంరక్షణ హుండీ ద్వారా రూ. 16,165 ఆదాయం సమకూరింది.
Also Read: ‘మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడొద్దు’.. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు సీరియస్!
అటు విదేశాల నుంచి వచ్చే భక్తులు, ప్రవాస భారతీయులు కూడా స్వామివారికి పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కానుకలుగా సమర్పించారు. ఈ లెక్కింపులో అత్యధికంగా అమెరికాన్ కరెన్సీ 2,373 డాలర్లు రాగా, యూఏఈ కి చెందిన 625 ధీరమ్స్, కెనడాకు చెందిన 65 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 60 రియల్స్ కానుకగా వచ్చాయి. వీటితో పాటు సింగపూర్ కి చెందిన 12 డాలర్లు, మలేషియాకు చెందిన 3 రింగిట్స్, అలాగే ఆస్ట్రేలియాకు చెందిన 5 డాలర్ల కరెన్సీని భక్తులు స్వామివారి హుండీలో వేశారు.
Also Read: సముద్రంలోకి అంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే!