Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వసంత కుమార్(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. రోశయ్య క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా… కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు.
1955లో పశ్చిమగోదావరి జిల్లా పూండ్లలో వసంతకుమార్ జన్మించారు. 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖలో నివసిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి వారి స్వగ్రామం ఎంఎంపురంకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.