Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.
ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. చంద్రబాబు
రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి మేతగా ఉపయోగపడే సొయాబీన్ మీల్ దిగుమతికి తక్షణమే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల స్థానికంగా మేత ఖర్చులు తగ్గి, రైతన్నలకు భారీ ఊరట లభిస్తుంది. అలాగే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ద్వారా ఫిష్ మీల్ ఎగుమతులను క్రమబద్ధీకరించాలని, తద్వారా స్థానిక మార్కెట్లో సమతుల్యత సాధించవచ్చని లేఖలో పేర్కొన్నారు. బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు.
అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆక్వా రంగంలో అగ్రగామిగా ఉన్నందున, రాజధాని అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే రైతులకు సాంకేతిక సాయం, కేంద్ర పథకాల లబ్ధి మరింత వేగంగా అందుతాయి.
పొగాకు ఎగుమతుల ప్రోత్సాహం
ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులను భారీగా ప్రోత్సహించాలని, దీనికోసం ‘నిర్యాత్ ప్రోత్సాహన్’ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కోరారు. అదే సమయంలో, ఆక్వా చెరువుల్లో వాడే ఏరియేటర్లు, అలాగే ప్రాసెస్ చేయని పొగాకుపై విధిస్తున్న జీఎస్టీ ని తగ్గించాలని డిమాండ్ చేశారు. పన్నుల భారం తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు మంచి డిమాండ్ లభిస్తుందని వివరించారు.
రూ.5 లక్షల టాప్ అప్ రుణాలు
రైతులకు పెట్టుబడి సాయం అందించేలా కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పరిమితిపై అదనంగా రూ. 5 లక్షల టాప్ అప్ రుణ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. కేంద్రం ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా, పొగాకు రైతులకు మేలు జరుగుతుంది.
Also Read: సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!