Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణవార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ముద్రగడ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ముద్రగడ మృతికి సీఎం చంద్రబాబు నివాళి
ముద్రగడ పద్మనాభం మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో ముద్రగడ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ముద్రగడ పద్మనాభం మృతిపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ముద్రగడ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
సామాజిక ఉద్యమాలకు తీరని లోటు.. కేసీఆర్
ముద్రగడ మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్పందిస్తూ సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ సంతాపం
ముద్రగడ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు తెలంగాణ సీఎంఓ (TG CMO) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలాగే ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ముద్రగడ పద్మనాభం మృతికి నివాళులర్పించారు. కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.
సొంత నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.