Hyderabad Traditional Foods: హైదరాబాద్ అంటే చాలు.. ఆహార ప్రియులకు ప్రధానంగా గుర్తుకు వచ్చేది ‘బిర్యానీ’. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ హైదరాబాద్ బిర్యానీని ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇందుకు తగ్గట్లే నగరంలో గల్లీకి నాలుగైదు బిర్యానీ సెంటర్లు సైతం దర్శనమిస్తుంటాయి. అయితే ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే.. అసలు ఈ బిర్యానీలు రాకముందు భాగ్యనగర ప్రజలు ఏం తినేవారు? ఇక్కడి రాజులు, సామాన్య జనం ఆరగించిన పక్కా లోకల్ వంటకాలేంటి? ఇప్పుడు ఆ రుచులు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్.. తెలంగాణ సంస్కృతితో పెనవేసుకుపోయి ఉండేది. అప్పట్లో ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారం.. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, అంబలి. పొలాల్లో పండే జొన్నలతో రొట్టెలు చేసుకుని.. తోటకూర, పప్పు, ఘాటైన పచ్చిమిర్చి పచ్చడి నంజుకుని తినేవారు. ఎండకాలం వచ్చిందంటే చద్ది అన్నం, రాగి అంబలి, జొన్న అంబలి తాగి ప్రాణం లేచొచ్చినట్లు ఫీలయ్యేవారు.
హైదరాబాద్ పాతబస్తీ వైపు వెళ్తే నిజాంల కాలం నాటి ‘అసఫ్ జాహీ’ జెండా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. ఆ జెండా మధ్యలో ఒక రొట్టె చిత్రం ఇప్పటికీ చూడొచ్చు. దాన్ని ‘కుల్చా’ అంటారు. బిర్యానీ కంటే ముందు హైదరాబాద్ను ఏలిన నిజాం రాజులకు కుల్చాలు, నాన్లు అంటే ప్రాణం. మైదా పిండితో మట్టి పొయ్యిల మీద కాల్చే ఈ కుల్చాలను నాటు కోడి పులుసు, మటన్ కర్రీతో కలిపి తినేవారు. అలాగే ‘తహారీ’ (మటన్ ముక్కలతో చేసే ఒక రకమైన పులావ్) కూడా అప్పట్లో బాగా ఫేమస్.
స్వీట్ల విషయానికి వస్తే.. అప్పట్లో ఇప్పటి లాగా రసగుల్లాలు, కాజు కత్లీలు ఉండేవి కాదు. బాదం, పిస్తా, కుంకుమపువ్వుతో చేసే ‘లౌజ్’ (Lauz) అనే సాంప్రదాయ స్వీట్ కు నవాబుల కాలంలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాగే ‘జోఖి షాహీ’, ‘డబుల్ కా మీఠా’, ‘ఖుబానీ కా మీఠా’ (ఆప్రికాట్ పండ్లతో చేసేది) అప్పట్లో పండగలకు, పెళ్లిళ్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.
హైదరాబాద్ లో పొద్దున లేవగానే ‘ఇరానీ చాయ్’ కోసం చాలా మంది పరిగెడుతుంటారు. కానీ 19వ శతాబ్దం ముందటి వరకు హైదరాబాద్లో చాయ్ సంస్కృతి అంతగా లేదట. అప్పట్లో ప్రజలు, పాలకులు ఎక్కువగా ‘కహ్వా’ (Kahwa) తాగేవారట. ఇది గ్రీన్ టీ ఆకులు, కుంకుమపువ్వు, దాల్చినచెక్క, బాదం పప్పులతో తయారుచేసే ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్. ఇది శరీరానికి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడేదని అప్పటి వారి నమ్మకం.
Also Read: East Godavari: అది పూర్తయితే..గోదావరి జిల్లాల శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం-సీఎం చంద్రబాబు
పూర్వం హైదరాబాదీలు ఎంతో ఇష్టంగా తిన్న ఆహారంలో కొన్ని ఇప్పటికీ లభిస్తున్నాయి. హైదరాబాద్లోని అనేక తెలంగాణ రుచుల హోటళ్లలో, ధాబాలలో జొన్న రొట్టెలు, నాటుకోడి పులుసు దొరుకుతున్నాయి. అలాగే పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ‘మదీనా హోటల్’, ‘షాద్ ఘర్’ లాంటి పాత హోటళ్లలో ఇప్పటికీ నిజాం శైలి కుల్చాలు, నాన్లు లభిస్తున్నాయి. అటు ‘ఖుబానీ కా మీఠా’.. ఇప్పటికీ హైదరాబాద్ ముస్లిం వివాహాల్లో మెయిన్ స్వీట్ గా కొనసాగుతూ వస్తోంది. దాదాపు అన్ని పేరున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఈ స్వీట్ లభిస్తుండటం విశేషం.
Also Read: స్మార్ట్వాచ్తో వీధి కుక్కల కష్టాలకు చెక్.. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఘనత