Sunday: జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారా..? అయితే మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారు. అయితే శాస్త్రం ప్రకారం మీ కష్టాలు పోవడానికి ఆదివారం సూర్యభగవానుడిని ఒక ప్రత్యేక పద్దతుల ద్వారా పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఆ పద్దతులేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ఆదివారం సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున నియమబద్ధంగా సూర్యుడిని ఆరాధిస్తే జాతకంలోని దోషాలు తొలగి, అనారోగ్య సమస్యలు తీరిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.
సూర్యుడికి ఆదివారం అర్ఘ్య ప్రదానం చేయడం: ఆదివారం సూర్యోదయ సమయంలో స్నానం ముగించి సూర్యుడికి ఎదురుగా నిలబడి రాగి పాత్రతో నీటిని సమర్పించడాన్ని అర్ఘ్యం అంటారట. ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొంచెం ఎర్ర చందనం, అక్షింతలు, ఎర్రటి పువ్వులు వేయాలట. రెండు చేతులతో పాత్రను తల పైకి ఎత్తి, నీటి ధారలో నుంచి సూర్యుడిని చూస్తూ నీటిని నేలపై (నొక్కకుండా మొక్కలకు లేదా పాత్రలోకి) వదలాలట. ఆర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమః లేదా ఓం ఘృణి సూర్యాయ నమః అని జపించాలట.
సూర్య నమస్కారాలు చేయడం: ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కోసం సూర్య నమస్కారాలు అత్యంత శక్తివంతమైనవని పండితులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు కనీసం 12 సార్లు ద్వాదశ ఆదిత్య మంత్రాలను పఠిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుందట.
సూర్యుని శ్లోకాలు పారాయణం చేయాలి: మీకున్న కష్టాలు తొలగిపోవడానికి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన కొన్ని శ్లోకాలు లేదా మంత్రాలు జపించడమో పారాయణ చేయడమో చేయాలట. అందులో మొదటిది ఆదిత్య హృదయం. ఇది రామాయణంలోని ఘట్టం. దీనిని పఠించడం వల్ల శత్రువులపై విజయం, మానసిక ధైర్యం కలుగుతాయట. రెండోది సూర్యాష్టకం. ఇది పారాయణ చేయడం వల్ల గ్రహ దోష నివారణ జరుగుతుందట.
ఆహార నియమాలు (ఉపవాసం): ఆదివారం నాడు వీలైతే సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం మంచిదట. అలా ఉపవాసం ఉండటం కుదరని వారు కనీసం ఉప్పు (Salt) లేని ఆహారాన్ని తీసుకోవాలట. సూర్యారాధనలో ఉప్పును విసర్జించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోందట.
దాన ధర్మాలు చేయడం: జాతకంలో సూర్యుడు బలపడాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా ఆదివారం నాడు గోధుమలు, బెల్లం, రాగి వస్తువులు లేదా ఎర్రటి వస్త్రాలను పేదలకు దానం చేయడం మంచిదట. ఆవుకు బెల్లం కలిపిన గోధుమ రొట్టెను తినిపించడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయట.
ఇంకా ఆదివారం నాడు మాంసాహారం, మద్యం తీసుకోకూడదట. సూర్యాస్తమయం తర్వాత ఉప్పుతో కూడిన ఆహారం తీసుకోకపోవడం మంచిదట. ఇంటి ముఖద్వారం వద్ద సూర్యబింబాన్ని ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుందట. అలాగే నిత్యం సూర్యుడిని ధ్యానించే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి, మనసులోని సంకల్పం బలంగా మారి కార్యసిద్ధి కలుగుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.