జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీనగర్లో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన (హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్) ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాధారణంగా ఇటువంటి వేడుకల్లో రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన రిబ్బన్ భారత జాతీయ జెండా రంగులను (త్రివర్ణ పతాకం) పోలి ఉండటాన్ని సీఎం గమనించారు.
గ్రేట్ డెసీషన్..
జాతీయ పతాక రంగులతో కూడిన రిబ్బన్ను కత్తెరతో కత్తిరించడం త్రివర్ణ పతాకాన్ని అవమానించడమేనని ఒమర్ అబ్దుల్లా భావించారు. ఆ రిబ్బన్ను కట్ చేసేందుకు ఆయన సున్నితంగా నిరాకరించారు. వెంటనే స్పందించిన ఆయన.. జెండా రంగులు ఉన్న వస్తువులను కత్తిరించడం సరికాదని అధికారులకు సూచించారు. అనంతరం ఆ రిబ్బన్ను తొలగించి వేరే సాధారణ రిబ్బన్ను ఏర్పాటు చేసిన తర్వాతే ఆయన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒకప్పుడు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం.. ప్రత్యేక జెండా ఉండాలని గట్టిగా వాదించిన నాయకుల్లో ఒమర్ అబ్దుల్లా ఒకరు. ఆర్టికల్ 370 రద్దును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కాలక్రమేణా ఆయన వైఖరిలో వచ్చిన మార్పును చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పతాకం పట్ల ఆయన ప్రదర్శించిన ఈ వినమ్రత.. దేశభక్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. కశ్మీర్ లోయలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు.. జాతీయ స్రవంతిలో కలుస్తున్న నేతల ఆలోచనా ధోరణికి ఇది నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్లు ప్రశంసలు..
సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘నిజమైన దేశభక్తి అంటే ప్రసంగాల్లో ఉండటం కాదు.. ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కనిపిస్తుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు. గతంలో విభజన రాజకీయాలు మాట్లాడిన నేతలే నేడు త్రివర్ణ పతాక గౌరవం కోసం నిలబడటం శుభపరిణామమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వీడియో ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.
ALSO READ: నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు