(23-12-2024 సోమవారం) ( కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగాలు )
తెలంగాణలోని నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో కొత్తగా 13 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో వాటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే మరో వెయ్యికిపైగా సర్వేయర్ పోస్టులు కూడా కలవనున్నాయి. జాబ్ క్యాలెండర్ లో భాగంగా వీటిని ప్రకటించి నియామకాలు చేపట్టనున్నారు.
(23-12-2024 సోమవారం) ( మళ్లీ వీఆర్వో వ్యవస్థ )
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం చేపట్టనుంది. పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో పోస్టులోకి తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దాదాపు 22 వేలకు పైగా వీఆర్వో, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో గత ప్రభుత్వం సర్దుబాటు చేసింది. అయితే ఆసక్తి, అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈనెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్ఏ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చిన వారిలో 10,954 రెవెన్యూ గ్రామాలకు నియమించనున్నారు. ఆ ఖాళీలకు సరిపడా పాతవాళ్లు రాకపోతే.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.
(23-12-2024 సోమవారం ) ( ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్ల పెంపు)
సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ జీవోలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈనెల 23న సచివాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1,672 చికిత్సలు ఉండగా వీటిలో 1,375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ఏటా ప్రభుత్వంపై 600 కోట్ల అదనపు భారం పడినా వెనక్కు తగ్గలేదు.
2013లో ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ధరలే ఇప్పటి దాకా అమలయ్యాయి. 11 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిని వైద్య ఆరోగ్యశాఖ విస్తృతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 79 లక్షల కుటుంబాలను ఆరోగ్యపరంగా ఆదుకుంటోంది. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం కింద కవరేజీ మొత్తాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
(23-12-2024 సోమవారం ) ( పెట్టుబడులకు ఆహ్వానం )
ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని మరింతగా పెంచుతోంది ప్రభుత్వం. సోమవారం సచివాలయంలో మలేషియా వాణిజ్య ప్రతినిధులతో సమావేశం జరిగింది. రాష్ట్రంలో సోలార్ పవర్, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ కు విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయాలపై చర్చించారు. పామాయిల్ సేద్యంలో సహకరించడం, టూరిజంలో పెట్టుబడులు, సహకారం లాంటి అంశాలను మంత్రులు మలేషియన్ ప్రతినిధి బృందానికి వివరించారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 20 మంది మలేషియా ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.
(24-12-2024 మంగళవారం ) ( అసలైన చరిత్ర అవసరం )
ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెరమీదే కాకుండా తెరవెనుక జరిగిన ఘటనల చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాసిన పుస్తకాన్ని ఈనెల 24న సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల దాకా సీఎం ప్రస్తావించారు. దేశంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. చైనా దురాక్రమణ, మణిపూర్ హింసపై మాట్లాడారు.
(24-12-2024 మంగళవారం ) ( ఇందిరమ్మ ఇండ్లకు వేళాయె)
కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్ను నియమించారు. పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ నాలుగేళ్లలో 20లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తి చేయబోతున్నారు.
లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నట్లు పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుకి ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వనుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. తొలి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు వెచ్చించనున్నారు.
(25-12-2024 బుధవారం ) ( మెదక్ అభివృద్ధికి అడుగులు )
ఈవారం మెదక్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఈనెల 25న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మెదక్ చర్చికి వెళ్లారు. ఆ తర్వాత పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని సీఎం దర్శించుకుని పూజలు చేశారు. జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
మెదక్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను కలుపుతూ 52.76 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణం, జిల్లా స్వయం సహాయ మహిళా సంఘాలకు 100 కోట్లతో బ్యాంక్ లింకేజీ చెక్ అందజేత, 35 కోట్లతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.అటు మెదక్ కేథడ్రల్ చర్చి దగ్గర 29 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
(25-12-2024 బుధవారం ) ( గ్రీన్ ఎనర్జీ పాలసీ )
గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల రెన్యువబుల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్లు, 2027-28లో 20,968 మెగావాట్లు, 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2024పై జనవరి 3న హైదరాబాద్ HICCలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.
(25-12-2024 బుధవారం ) ( ట్రాన్స్ జెండర్లకు కొత్త జీవితం)
సమాజంలో నిరాదరణకు గురయ్యే ట్రాన్స్ జెండర్ల వర్గానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర అవమానాలకు గురైన వారికి అక్కడే విధులు కేటాయించింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ అసిస్టెంట్స్ కోసం ఎంపికైన వారికి 15 రోజులపాటు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవుట్ డోర్, ఇండోర్ తో పాటు టెక్నికల్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో వారు విధుల్లో చేరారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు.
( 26-12-2024 గురువారం ) ( కులగణనలో మార్గదర్శి )
తెలంగాణలో కులగణన చేపట్టి దేశవ్యాప్తంగా అటెన్షన్ తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ఇదే విషయాన్ని బెలగావిలో జరిగిన సీడబ్లూసీ సమావేశంలోనూ ప్రస్తావించారు. కులగణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం వచ్చే ఏడాది చేపట్టబోయే జనగణనలో కుల గణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి cwcలో ప్రతిపాదించగా.. దీనికి సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
(26-12-2024 గురువారం ) ( సినీ ఇండస్ట్రీ కోసం సబ్ కమిటీ )
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీకి కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్టు ప్రకటించారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 26న టాలీవుడ్ సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్ లో సీఎం చాలా విషయాలు ప్రస్తావించారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చని, తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని సీఎం సూచించారు. గంజాయి, డ్రగ్స్తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు.
(27-12-2024 శుక్రవారం ) ( సిటీలో ఇక ట్రాఫిక్ కు చెక్ )
హైదరాబాద్ అభివృద్ధి కోసం న్యూ జెనరేషన్ ఐడియాలను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. సిటీని అన్ని రకాలుగా డెవలప్ చేసేందుకు నిధులు కేటాయించడం, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు చేపట్టబోతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఆరు జంక్షన్లలో ఆరు స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్ పాస్ లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.
ఇందుకోసం రోడ్ నంబర్ 12 ప్రారంభమయ్యే విరించి హాస్పిటల్ నుంచి నుంచి ఒమేగా హాస్పిటల్ మీదుగా జూబ్లీ హిల్స్ చెక్పోస్టు వరకు ఆరున్నర కిలోమీటర్ల పొడవున రోడ్డును విస్తరించనున్నారు. విస్తరణకు సంబంధించి ఇప్పటికే 303 ఆస్తులను మార్కింగ్ చేశారు. అటు ఫ్యూచర్ సిటీపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం 41.5 కిలో మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్గల్ రీజినల్ రింగ్ రోడ్ వరకు నిర్మించాలని నిర్ణయించారు.
( 28-12-2024 శనివారం ) ( భూముల మాయంపై ఫోరెన్సిక్ ఆడిట్ )
ధరణి పోర్టల్ జనవరి 1 నుంచి భూ భారతి పోర్టల్ గా మారబోతోంది. డిసెంబర్ 31 తో టెర్రాసిస్ గడువు ముగియనుండడంతో జనవరి 1 నుండి NIC భూ భారతి పోర్టల్ ను పూర్తి స్థాయిలో నిర్వహించబోతోంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలను టెర్రాసిస్ కంపెనీ ట్రాన్సిట్ చేయనుంది. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ అవుతోంది. నిషేధిత భూములు సక్రమంగా మార్చుకున్న తీరుపై పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా తేల్చబోతోంది. అర్థరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు.. ఏ సర్వర్ నుంచి, ఏ ఐడీ అడ్రస్ నుంచి ఏమేం చేశారు… ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించారన్న అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నారు.