KCR Campaign: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం గడువు చివరి దశకు చేరుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ సైతం ప్రచారం స్పీడ్ పెంచింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా? రారా? అనేది ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతుంది. కేసీఆర్ వస్తే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, పార్టీ కేడర్ లోనూ జోష్ పెరుగుతుందని, పార్టీ గెలుపు సునాయసం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే నేటి వరకు పార్టీ నేతలకు సైతం గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వడం లేదంట.
కేసీఆర్ ప్రచారానికి వస్తే.. ఆయన ప్రత్యర్థులపై చేసే కామెంట్లు, విమర్శలు.. సామెతలు, విసిరే సెటైర్లు ప్రజలను ఆకట్టుకుంటాయి. ఒక్కసారిగా పార్టీకి జోష్ వస్తుంది. ఆయన చేసే వ్యాఖ్యలకు ప్రజలు అంతోఇంతో ఆకర్షితులవుతారు. దాంతో పార్టీ విజయం ఖాయమవుతుందని నేతలు సైతం పేర్కొంటున్నాయి. జూబ్లీహిల్స్ ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా ప్రచారానికి వస్తారని పార్టీ పేర్కొంది. నేతలకు సైతం హింట్ ఇచ్చారు.
ఆ తర్వాత ఎర్రవెల్లి ఫాంహౌస్లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాత్రం కేసీఆర్ ప్రచారంపై స్పష్టత ఇవ్వలేదంట. నేతలు సమిష్టిగా పనిచేయాలని, గెలుపు మనదేని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని, మనవైపు చూస్తున్నారని.. కాంగ్రెస్ రెండేళ్లలో వైఫల్యం చెందిందని విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారంట. నిత్యం గ్రౌండ్ లెవల్ పరిస్థితులను మానిటరింగ్ చేయాలని సూచించారంట. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన స్టార్ క్యాంపెయిన్ లిస్టులో సైతం కేసీఆర్ పేరు చేర్చారు. ఆ క్రమంలో నియోజకవర్గంలోని కేడర్ అంతా కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన రోడ్డుషోలు నిర్వహిస్తే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గులాబీశ్రేణులంతా ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటివరకు పార్టీ మాత్రం ఇంకా బీఆర్ఎస్ అధినేత ప్రచారం విషయాన్ని సస్పెన్స్లోనే పెడుతోంది.
వరంగల్లో ఈ ఏడాది ఏప్రిల్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించింది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగం చేశారు. ఆతర్వాత కేసీఆర్ మళ్లీ జనాల్లోకి రాలేదు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పార్టీ నేతలతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేస్తుండటం, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాలని సూచనలు చేస్తున్నారు. అంతే తప్ప తర్వాత మీడియా ముందుకు గానీ, ప్రజల్లోకి గానీ రావడం లేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది నాంది అని, ఇక్కడి నుంచే పార్టీ జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ఇదే తొలి అడుగు అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అంత కీలకంగా మారిన ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ రాకపై క్లారిటీ రావడం లేదు. పెద్దాయన ప్రచారానికి వచ్చి పార్టీ కేడర్ లో జోష్ నింపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతితో ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. అంటే ప్రచార గడువు రోజులు మాత్రమే ఉండటంతో హరీష్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ఏ డివిజన్లలో ఏయే డివిజన్లలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలా? లేకుంటే రోడ్డుషోలు నిర్వహించాలా? అనేదానిపై ప్లాన్ చేస్తున్నారంట. అందుకోసం ఎన్నికల సంఘం నుంచి అనుమతికోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మూడ్రోజులు కీలకం కావడంతో హరీష్ రావును రంగంలోకి దింపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపడుతుంది. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఓటర్ క్యాంపెయిన్ విస్తృతంగా చేపట్టింది. నిత్యం నేతల ప్రచార సరళిపై ఆరా తీస్తుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సూచనలు ఇస్తుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రచారంపైనే గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.
Story by Apparao, Big Tv