CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకువెళ్తుంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తూ ప్రచారంలో స్పీడ్ను పెంచుతుంది. నియోజకవర్గంలోని ప్రభావిత చేయగలిగే అంశాలను ప్రజలకు వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి ఊపును తీసుకోస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ శ్రేణుల్లో దశాబ్దంన్నర తర్వాత గెలుపుపై విపరీతమైన ధీమా కనిపిస్తోందంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కీలక అస్త్రాలను ఉపయోగిస్తోంది. ఈ నియోజకవర్గంలో పీజేఆర్, ఎన్టీఆర్ అభిమానుల ప్రభావంతో పాటు మైనార్టీ ఓటర్ల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. దీంతో ఈ మూడు ఫ్యాక్టర్స్ ను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చుకునేలా పార్టీ ఆలోచిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత పీజేఆర్కు బలమైన ఫాలోయింగ్ను ఉంది. నియోజకవర్గంలోని బొరబండ, యూసఫ్ గూడ, రెహ్మత్ నగర్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాలతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ పీజేఆర్ ప్రభావం కనిపిస్తుంటుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్ ప్రభావంతో సుమారు 50 వేల ఓటర్లు ప్రభావితం అవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో పీజేఆర్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి కాంగ్రెస్ కృషి చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహారించిన మాజీ ఎమ్మెల్యే పీజేఆర్కు ఉన్న ఫాలోయింగ్ను క్యాష్ చేసేలా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బోరబండలో పీజేఆర్ విగ్రహంతో పాటు ఆయన పేరు కూడా పెడతామని సీఎం హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. దీంతో పాటు గత ప్రభుత్వం పీజేఆర్ ను విస్మరించిన తీరును ప్రచారంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పి.జానార్దన్ రెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ తన అభ్యర్థిని పోటీ చేయించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో అప్పటి ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయని…కానీ పీజేఆర్ మరణంతో ఆయన కుటుంబంపై ప్రజల్లో వెల్లువెత్తిన సానుభూతిని కనీసం లెక్కచేయకుండా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ చేయించారనే అంశాన్ని సీఎం లేవనెత్తారు. దీంతో బీఆర్ఎస్ లేవనెత్తిన సెంటిమెంట్ నినాదాన్నిహస్తం నిలువరించినట్లైందనేది టాక్.
బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధి బరిలో ఉన్న నేపథ్యంలో ఆ వర్గం ఓట్ బ్యాంక్ను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ వ్యూహారచన చేస్తుందట. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు కూడా జూబ్లీహిల్స్లో అభిమానులు ఉన్నారు. కమ్మ ఓటర్లు ప్రభావం కూడా నియోజకవర్గంలో ఉంది. ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేలా అడుగులు వేస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే కమ్మ సంఘాల నాయకులు సీఎంతో భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారంతో పాటుగానే అమీర్ పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
సీఎం ప్రకటనతో కమ్మ సంఘాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్టీఆర్ ఆభిమానులతో కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్కు బలంగా మారబోతుందని చర్చ నడుస్తోంది. ఓవైపు పీజేఆర్, మరోవైపు ఎన్టీఆర్ చరిష్మా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడంలో సక్సెస్ అయిందనే టాక్ నియోజకవర్గంలో ఉందట.
ఇక అత్యధికంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో మైనార్టీ వర్గాల ఓట్లు దాదాపు లక్షన్నర ఉన్నాయి. వాళ్లందరి ఓటు బ్యాంక్ ను సొంతం చేసుకునేందుకు మంత్రిగా అజారుద్దీన్ కు ఛాన్స్ ఇచ్చారు. పైగా ఆయన గతంలో ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి దాదాపు 50 వేల ఓట్లను సొంతం చేసుకోగలిగారు. దీంతో ఈ మూడు ఫ్యాక్టర్లు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు ప్లస్ అవుతాయనే అభిప్రాయంలో హస్తం నేతలు ఉన్నారట. మైనార్టీ, క్రిస్టియన్, బీసీ కుల సంఘాలతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాలు, కార్మిక సంఘాలకు సీఎం హామీల వర్షం కురిపించారు. ఆయా సంఘాలకు ఏళ్ల తరబడి నుంచి పెండింగ్ లోని సమస్యల పరిష్కరానికి హామీలు ఇస్తూనే, సంక్షేమం, డెవలప్ మెంట్ కు తానే బాధ్యత తీసుకుంటానని భరోసా కల్పిస్తున్నారు. దీంతో సంఘాలన్నీ బహిరంగంగానే మద్ధతును ప్రకటించడంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ ఉందట.
సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోందంటున్నారు. ముఖ్యమంత్రి రోడ్షోలు, బహిరంగ సభలు కాంగ్రెస్ అభ్యర్థికి ఊతమిస్తున్నాయట. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో పాటు బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు నడుస్తోందని, వీరిది ఫెవికాల్ బంధమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో సీఎం సక్సెస్ అయ్యారనే టాక్ పార్టీలో ఉందట. ఇవన్నీ తమకు కలిసి వచ్చే అంశాలుగా పార్టీ లీడర్లు చెబుతున్నారు.
Story by Apparao, Big Tv