POCSO Cases: దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో మాత్రం మనం ఇంకా వెనుకబడే ఉన్నామనే చేదు నిజాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలు మరోసారి నిరూపించాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న పోక్సో కేసుల సంఖ్య చూస్తుంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఏకంగా 69 వేలకు పైగా రికార్డు స్థాయి కేసులు రికార్డుల్లోకి ఎక్కాయంటే, సమాజంలో మృగాలు ఎంతలా స్వైరవిహారం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నివేదిక కేవలం అంకెలను మాత్రమే చూపించదు, ఆ అంకెల వెనుక ఉన్న వేలాది మంది అమాయక పిల్లల తలరాతలను, వారి కుటుంబాల కన్నీటి గాథలను మన కళ్లముందు ఉంచుతుంది.
ఊహ తెలియని పసిప్రాయాలపైనే..
ఈ ఘోరమైన నేరాల్లో అత్యంత విచారకరమైన, దారుణమైన విషయం ఏంటంటే.. బాధితుల్లో దాదాపు 98 శాతం మంది ఆడపిల్లలే ఉండటం. లైంగిక వేధింపుల బారిన పడుతున్న వారిలో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. అసలు ఊహ తెలియని, తప్పటడుగులు వేసే ఆరేళ్ల లోపు పసిపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయనే చేదు నిజం వింటుంటే.. మన చుట్టూ ఉన్నది మనుషులా లేక నరరూప రాక్షసులా అనే అనుమానం రాక మానదు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో, నమ్మకమైన చేతుల్లోనే నలిగిపోతున్న పసిమొగ్గల ఆక్రందనలు సమాజ విచక్షణను ప్రశ్నిస్తున్నాయి.
శిక్షల శాతం ఎందుకింత తక్కువ?
కఠినమైన చట్టాలు తెచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మృగాళ్లకు శిక్ష పడటం లేదనేది సత్యం. విచారణ పూర్తయిన ప్రతి 100 పోక్సో కేసులను పరిశీలిస్తే, కేవలం 32 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. మిగిలిన 68 కేసుల్లో నేరగాళ్లు క్లీన్ చిట్తో, సమాజంలో కాలర్ ఎగరేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నారు. అంటే బాధితులకు న్యాయం దక్కే కేసుల కంటే.. చట్టంలోని లొసుగులను, సాక్ష్యాధారాల లోపాలను వాడుకుని కామాంధులు బయటపడుతున్న కేసులే రెట్టింపుగా ఉండటం తీవ్ర ఆందోళనకరం.
వ్యవస్థల వైఫల్యమా? బాధితుల దురదృష్టమా?
పిల్లలపై పెరుగుతున్న ఈ అమానుష నేరాలు ఒకెత్తయితే.. కోర్టుల్లో తక్కువగా పడుతున్న శిక్షల శాతం, విచారణలో జరుగుతున్న ఏళ్ల తరబడి జాప్యం ఇవన్నీ కలిసి ఇవాళ పాలక వ్యవస్థపై, న్యాయ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తగిన సమయంలో సాక్ష్యాలను సేకరించకపోవడం, కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, విచారణ ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల నిందితులకు అనుకూలంగా మారుతోంది. న్యాయం జరగడంలో ఆలస్యమైతే అది న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుందన్న నినాదం ఇక్కడ అక్షరాలా నిజమవుతోంది.
మార్పు ఎక్కడ రావాలి? తక్షణ పరిష్కారం ఏమిటి?
ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట పడాలంటే కేవలం చట్టాలు పుస్తకాల్లో ఉంటే సరిపోదు, వాటి అమలులో వేగం పెరగాలి. పోక్సో కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యను పెంచి, ఏడాది లోపే విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. అలాగే కేవలం న్యాయవ్యవస్థే కాదు, సమాజంలో కూడా మార్పు రావాలి. చిన్న పిల్లలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పై అవగాహన కల్పించడంతో పాటు, ఇంట్లో, బయట వారి భద్రతపై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఈ రాక్షస సంస్కృతికి అడ్డుకట్ట వేసి, రేపటి పౌరులకు సురక్షితమైన సమాజాన్ని అందించగలం.
Also Read: పిఠాపురంలో వరుస హత్యల కలకలం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య.. అసలేం జరిగింది?