Ambanis to spend Rs 1000 CRORES on Anant Ambani wedding: రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడి అనంత్ ప్రీ వెడ్డింగ వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వేలాది ప్రత్యేక అతిథులు గుజరాత్లోని జామ్ నగర్ చేరుకుంటున్నారు. ఈ వేడుకల కోసమే అంబానీ కుటుంబం రూ. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
2023 జనవరి 19న కుటుంబ సభ్యుల మధ్య అనంత్ అంబానీ, రాధికల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. వీరి వివాహం.. వచ్చే జులై 12న ముంబైలో జరగనుంది. అయితే.. వివాహానికి ముందు జరిగే ప్రీవెడ్డింగ్ వేడుకలు నేడు మొదలయ్యాయి. ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం జామ్ నగర్లో స్టార్ హోటళ్లు సరిపడా లేకపోవటంతో వారందరికీ అత్యంత ఆధునిక సౌకర్యాలున్న టెంట్లను రెడీ చేశారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న అతిథులను ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు.
read more: గోప్యత వద్దు.. రేపటి భద్రతే ముద్దు..
ఇక.. నేటి సాయంత్రం ‘యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్ల్యాండ్’ పేరుతో అదిరిపోయే పార్టీ జరగనుంది. రేపు.. ‘ఎ వాక్ ఆన్ ది వైల్డ్సైడ్’ థీమ్తో జామ్ నగర్లోని అంబానీ జంతు సంరక్షణ కేంద్రం బయట మరో పార్టీని నిర్వహిస్తున్నారు. అతిథులను అలరించేందుకు రిహాన్నా, డేవిడ్ బ్లైయిన్ వంటి పలువురు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇండోర్ నుంచి వచ్చిన 21 మంది చెఫ్స్.. వచ్చే అతిథుల కోసం 2500 వంటకాలతో మెనూను సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, ట్రంప్ కుమార్తె ఇవాంకా వంటి విదేశీ అతిథులు, దిగ్గజ క్రికెటర్లు, బాలీవుడ్ నటీనటులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. ఈ వేడుకకు ముందు ముకేష్ అంబానీ తన స్వగ్రామానికి చెందిన అందరినీ ఆహ్వానించి.. కుటుంబ సమేతంగా వారికి దగ్గరుండి వడ్డించి.. వారి ఆశీస్సులు పొందారు. గతంలో రూ. 700 కోట్లు ఖర్చు పెట్టి కుమార్తె ఈశా వివాహం చేసిన అంబానీ ఆ రికార్డును తిరగరాస్తూ చిన్న కొడుకు పెళ్లి చేయటం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటి వరకు 1981 జులైలో జరిగిన ప్రిన్స్ ఛార్లెస్- డయానాల వివాహం అత్యంత ఖరీదైనదిగా (రూ.916 కోట్లు) రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే.
ముకేశ్ – నీతా అంబానీల కుమార్తె ఈశా, పెద్ద కొడుకు ఆకాశ్లకు 2018, 2019లో వివాహం కాగా చివరివాడైన అనంత్ పెళ్లి ఘనంగా జరుగుతోంది. రిలయన్స్ రిటైల్, డిజిటల్ సేవలు, ఇంధనం, జియో తదితర వ్యాపారాల్లో వీరంతా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.