Bank Strike: దేశవ్యాప్తంగా మూడు రోజులు బ్యాంకులు సంఘాలు సమ్మెకు దిగనుండడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఒక సలహా జారీ చేసింది. సమ్మె కాలంలో సంభవించే అంతరాయాలను నివారించడానికి బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగా పూర్తి చేసుకోవాలని వినియోగదారులను కోరింది ఎస్బీఐ.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-యూఎఫ్బీయూ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం నుంచి సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అంతకు రెండు రోజులు అనగా 26, 27న శని-ఆదివారాలు రావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో బ్యాంకు లావాదేవీలు ఉన్నవారు సమ్మె కంటే ముందు పూర్తి చేసుకోవాలని సూచన చేసింది.
ఇప్పటికే సెప్టెంబర్ 11న ఓ రోజు సమ్మె చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల చివర మరోసారి సమ్మెకు రెడీ అయ్యింది. అప్పటికీ కేంద్రం దిగిరాకుండా ఉంటే.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఆలోచన చేస్తోంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు సలహాలు జారీ చేసింది. సమ్మె సమయంలో బ్యాంక్ బ్రాంచ్ సిబ్బంది సహాయం అవసరమయ్యే పనులు, డాక్యుమెంట్ల పరిశీలన, కొన్నిరకాల చెక్కుల ప్రాసెసింగ్ వంటి సేవలకు ఆటంకం కలగవచ్చని స్పష్టంచేసింది. సమ్మెలో ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటారనే దానిపై ఆయా బ్రాంచ్ పని తీరు మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
ALSO READ: ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి
వినియోగదారులు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని కోరింది. నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్డ్రాయల్ మెషీన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వీటితోపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలియజేసింది. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా ఆటంకం లేకుండా చేసుకోవచ్చని వివరించింది. బ్రాంచ్కు వెళ్లాల్సిన పనులను ముందుగా ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది.