Reliance Ice Cream: దేశీయ రిటైల్, డిజిటల్ రంగాల్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పుడు మరో అతిపెద్ద వినియోగదారుల రంగంలోకి అడుగుపెట్టింది. ‘బొంబాయి క్రీమరీ’ పేరుతో ఐస్ క్రీమ్ మార్కెట్లోకి వస్తున్న రిలయన్స్ వ్యూహంపై.. ఆ రంగానికి చెందిన నిపుణులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. ఇది కేవలం ఐస్ క్రీమ్స్ అమ్మడం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా భారీ ‘కోల్డ్ చైన్’ నెట్వర్క్ను నిర్మించడమే రిలయన్స్ అసలు లక్ష్యమని భావిస్తున్నారు.
గతంలో టెలికాం రంగంలో ‘జియో’ తెచ్చిన విప్లవం, సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ‘క్యాంపా కోలా’ను తిరిగి పునరుద్ధరించిన తీరును పరిశీలిస్తే.. రిలయన్స్ వ్యూహం ఏంటో స్పష్టమవుతుంది. భారీ స్థాయి ఉత్పత్తి, సుదూర ప్రాంతాలకు విస్తరించగల పంపిణీ వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్), తక్కువ ధరల విధానమే రిలయన్స్ తన ఆయుధాలుగా మార్చుకోబోతోంది. టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్. చంద్రమౌళి ప్రకారం.. క్యాంపా కోలా వ్యాపారం కోసం రిలయన్స్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న మౌలిక వసతులు ఐస్ క్రీమ్ వ్యాపారానికి బాగా కలసిరానున్నాయి.
రిలయన్స్ కాంపా కోలా బ్రాండ్ను రూ. 22 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ గత త్రైమాసికంలో కేవలం ఈ కూల్ డ్రింక్స్ ద్వారానే ఏకంగా రూ. 4,700 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుతం క్యాంపా కోలాకు 5,000 మంది డిస్ట్రిబ్యూటర్లు, లక్షలాది రిటైల్ షాపుల నెట్వర్క్ ఉంది. వారు ఇప్పటికే ప్రతీ దుకాణంలో కూలర్ల (Coolers) కోసం భారీగా పెట్టుబడి పెట్టారు. అదే కూలర్లలో సులభంగా అమర్చగలిగే మరో ఉత్పత్తి ఐస్ క్రీమ్ కాబోతోందని ఎన్. చంద్రమౌళి అంచనా వేశారు.
ఐఎంఏఆర్సి (IMARC) చేసిన అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో ఐస్ క్రీమ్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 37,000 కోట్లుగా ఉంది. ప్రీమియం ఫ్లేవర్లు, చాక్లెట్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణతో 2033 నాటికి ఈ మార్కెట్ 11 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 57,533 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ రంగంలోనూ తన సత్తా చాటాలని రిలయన్స్ భావిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి.
అయితే సాధారణ ప్యాకేజ్డ్ పానీయాలతో పోలిస్తే ఐస్ క్రీమ్ వ్యాపారం ఖరీదైనదే కాకుండా ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం.. లక్ష ఫ్రీజర్లను మార్కెట్లో ఏర్పాటు చేయడానికే ఐస్ క్రీమ్ కంపెనీకి రూ. 300 నుండి 400 కోట్లు ఖర్చవుతుంది. దీనికి టంపరేచర్ మెయింటెనెన్స్ మరింత సవాలుగా నిలుస్తుంది. ఫ్యాక్టరీ నుండి కస్టమర్ చేతికి అందే వరకు ఐస్ క్రీమ్ ఉత్పత్తులను మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ (-18°C) ఉష్ణోగ్రత వద్దే ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాధారణ ప్యాకేజ్డ్ సరుకులతో పోలిస్తే ఐస్ క్రీమ్ రవాణా ఖర్చు రెట్టింపు అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ కారణం చేతనే.. దేశీయ ఐస్ క్రీమ్ మార్కెట్ ఇప్పటికీ ప్రాంతీయంగానే విడిపోయి ఉందంటున్నారు. పశ్చిమాన వాడిలాల్, హావ్మోర్.. దక్షిణాన అరుణ్, ఐడియల్.. ఉత్తరాన క్రీమ్బెల్, మదర్ డైరీ వంటివి బలంగా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఒక్క ‘అముల్’ (Amul) మాత్రమే దేశవ్యాప్తంగా బలమైన నెట్వర్క్ కలిగి ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ రాకతో ఐస్ క్రీమ్ రంగంలో భారీ మార్పులను చూసే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.
అయితే రిలయన్స్ వద్ద ఎంత ఆర్థిక బలం, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నప్పటికీ ఐస్ క్రీమ్ విభాగంలో వినియోగదారుల నమ్మకాన్ని, బ్రాండ్ పట్ల కస్టమర్ లాయల్టీని సంపాదించడం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ధరల వల్ల ఆరంభంలో కస్టమర్లు కొనుగోలు చేసినప్పటికీ రుచి, నాణ్యత నచ్చితేనే మళ్లీ కొంటారని చంద్రమౌళి పేర్కొన్నారు. అంతేకాకుండా, రిలయన్స్ చేపట్టిన ప్రతి వినియోగదారుల వ్యాపారమూ విజయవంతం కాలేదని రిలయన్స్ జ్యువెల్స్ స్థానిక జ్యువెలర్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోందని గుర్తుచేశారు.
Also Read: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య.. నెట్టింట ఇంటర్వ్యూ క్లిప్ వైరల్.. యాంకరే హత్యకు పురిగొల్పిందా?
అయితే ఐస్ క్రీమ్ వ్యాపారం వెనుక రిలయన్స్ టార్గెట్ మరొకటి ఉందని చంద్రమౌళి విశ్లేషించారు. ‘రిలయన్స్ ఐస్ క్రీమ్ రంగంలోకి అడుగుపెడుతోందంటే వారు దేశవ్యాప్తంగా ఒక భారీ ‘శాకాహార కోల్డ్ చైన్’ (Vegetarian Cold Chain) నెట్వర్క్ను నిర్మిస్తున్నారని అర్థం. ఫ్రోజెన్ వెజిటబుల్స్, ఇతర ఆహార పదార్థాల పంపిణీకి ఇది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్గా మారనుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. మెుత్తంగా ‘బొంబాయి క్రీమరీ’ బ్రాండ్తో రిలయన్స్ జాతీయ స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది కాలమే నిర్ణయించాలి. అయితే ఈ ఎంట్రీతో భారత ఐస్ క్రీమ్, కోల్డ్ చైన్ మార్కెట్లో పోటీ తీవ్ర స్థాయికి చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ఖైరతాబాద్ బైపోల్పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!