UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు (Merchant Discount Rate – MDR) విధించేందుకు జరుగుతున్న ప్రతిపాదనలు ఇంధన రిటైల్ రంగంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ యజమానులు, డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత రూల్స్ ఉపసంహరించుకోకపోతే అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిపే యూపీఐ చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.
పెట్రోల్ పంపుల వద్ద జరిపే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిపోతున్న నిర్వహణ ఖర్చులు, ఏళ్ల తరబడి మారని కమిషన్ల వల్ల ఈ అదనపు భారాన్ని భరించడం తమకు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సహా పలు ప్రాంతీయ సంఘాలు కూడా పెట్రోల్ పంపులకు ఎండీఆర్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని, సంబంధిత అధికారులను కోరాయి.
ఈ ఎండీఆర్ ప్రతిపాదనలపై వర్తక సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. రూ.2,000 దాటిన చెల్లింపులపై పెట్రోల్ బంకుల్లో యూపీఐ సేవలు నిలిపివేస్తే అది సాధారణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. డిజిటల్ లావాదేవీల వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయపడింది.
Also Read: రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!
ఒకవేళ డీలర్లు చెప్పినట్లు అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 దాటిన డిజిటల్ చెల్లింపులను నిలిపివేస్తే సాధారణ వాహనదారులు, ముఖ్యంగా కార్లు, భారీ వాహనాల్లో డిజిటల్ రూపంలో ఇంధనం నింపుకునే వారికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎండీఆర్ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!