Banks Nationwide Strike: దేశవ్యాప్తంగా మంగళవారం బ్యాంకులు మూతపడనున్నాయి. చాలాకాలంగా పెండింగ్లో బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకపోవడం అందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాల యూనియన్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చాయి. వరుసగా శనివారం నుంచి మంగళవారం వరకు బ్యాంకులు సెలవు కానుండడంతో వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు.
దేశవ్యాప్తంగా మంగళవారం బ్యాంకుల సమ్మె
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. తమ చిరకాల డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు పిలుపు నిచ్చారు. దీంతో శనివారం నుంచి మొదలు మంగళవారం వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్లు జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చాయి.
ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 నిబంధనల ప్రకారం.. తొమ్మిది బ్యాంకు సంఘాలకు ప్రాతినిధ్యం వహించే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-UFBU ఈ సమ్మె నోటీసు జారీ చేసింది. జనవరి 26 అర్ధరాత్రి నుండి జనవరి 27 అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, చీఫ్ లేబర్ కమిషనర్-డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లకు పంపిన నోటీసులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. అన్ని శనివారాలను బ్యాంకు సెలవు దినాలుగా ప్రకటించాలన్నది వారి ప్రధాన డిమాండ్. సమ్మె లక్ష్యం అదేనని యూనియన్లు పేర్కొన్నాయి.
వారానికి ఐదు రోజుల పని దినాలపై ఉద్యోగ సంఘాల డిమాండ్
సమ్మె నోటీసు అందిన తర్వాత సమస్యను పరిష్కరించడానికి చీఫ్ లేబర్ కమిషనర్ ఆయా బ్యాంకు సంఘాలతో చర్చలు జరిపారు. చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో యూనియన్లు సమ్మె దిశగా అడుగులు వేశాయి. ఉద్యోగుల డిమాండ్ వెనుక కారణాలు లేకపోలేదు.
నార్మల్గా బ్యాంకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. ఈ మధ్యకాలంలో రాత్రి 9 గంటల వరకు ఉద్యోగులను బ్యాంకులో ఉంచుతున్నారని అంటున్నారు. కొత్తగా ఉద్యోగాలు నియామకం లేకపోవడంతో మిగతా ఉద్యోగులపై పనిభారం నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెకు దిగారు.
ఈ సమ్మె ప్రభావం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు పలు ప్రవేటు బ్యాంకులపై పడనున్నాయి. సమ్మె జరిగితే సేవలకు అంతరాయం కలుగుతుందని శుక్రవారం తమ ఖాతాదారులను అప్రమత్తం చేశారు ఆయా బ్యాంకుల సిబ్బంది.
ALSO READ: రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం.. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ బ్యాంకుల పని తీరుపై సమ్మె ప్రభావం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు నెలలో రెండు, నాలుగు శనివారాలను సెలవు దినాలుగా ఉన్నాయి. కాకపోతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్నది వారి డిమాండ్. దీనివల్ల ఏడాదిలో మెజారిటీ వారాలు ఆరు పని దినాలుగా ఉన్నాయని చెబుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ , ఎల్ఐసీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు, పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమల్లో ఉందని, బ్యాంకులకు ఆరు రోజులు ఎందుకన్నది వారి ప్రశ్న. ఈ వ్యవహారంపై బ్యాంకు యూనియన్లు వ్యవహారం ఫైనాన్స్ మినిస్టర్ వరకు వెళ్లింది. చివరి నిమిషంలో ఆ ఫైలుపై సంతకం ఆగిపోయిందని అంటున్నారు. ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు బ్యాంకులు సిద్ధమైట్టు తెలుస్తోంది.