Gold Demand: దేశంలో బంగారం డిమాండ్ క్రమంగా తగ్గుతోందా? ప్రధాని మోదీ పిలుపు పని చేసిందా? ఆ స్థాయిలో కొనుగోలు చేయలేక మధ్యతరగతి ప్రజలు వెనక్కి తగ్గారా? దేశంలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి కీలక వివరాలు బయటకు వచ్చాయి. జూన్ త్రైమాసికానికి సంబంధించి పసిడి డిమాండ్ 6 శాతం వరకు తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు- విదేశీ మాదక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు బంగారం కొనుగోళ్లకు దూరం ఉండాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. దీనికితోడు దిగుమతి సుంకాలు పెంచింది కేంద్రం. ఫలితంగా బంగారం గిరాకీపై ప్రభావం చూపించాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి దేశంలో పసిడికి డిమాండ్ 6 శాతానికి పడిపోయిందని తేల్చింది ప్రపంచ స్వర్ణ మండలి. ప్రస్తుతం 131 టన్నులకు పరిమితమైందని నివేదిక పేర్కొంది. గతేడాది ఇదే కాలంలో 139.7 టన్నులుగా నమోదు అయ్యింది.
విలువ పెరిగింది-కొనుగోళ్ల పరిమాణం తగ్గినప్పటికీ విలువ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. గతేడాది ఇదే కాలానికి నమోదైన రూ.1.32 లక్షల కోట్లతో పోలిస్తే.. విలువ పరంగా డిమాండ్ 50 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది దేశంలో పసిడి డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉంటుందని డబ్ల్యూసీజీ ఓ అంచనా వేసింది. ఇక జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు చేరినట్టు ప్రస్తావించింది. ప్రధాని పిలుపు మేరకు బంగారానికి డిమాండ్ తగ్గినా గ్రే మార్కెట్ నిర్వహణ, స్మగ్లింగ్ను ప్రోత్సహించే అవకాశం ఉందని డబ్ల్యూసీజీ రీజినల్ సీఈఓ అభిప్రాయపడ్డారు.
గోల్డ్ బిస్కెట్లు, నాణేల డిమాండ్- మొత్తం డిమాండ్లో ఆభరణాల విక్రయాలు 15 శాతం తగ్గిపోయింది. 89 టన్నుల నుంచి 75.1 టన్నులకు పడిపోయినట్టు పేర్కొంది. దాదాపు 15 శాతం పడిపోయింది. సురక్షిత పెట్టుబడిగా భావించే గోల్డ్ బిస్కెట్లు, నాణేల డిమాండ్ 9 శాతం పెరిగింది. 50.3 టన్నులకు చేరుకుంది. మరోవైపు బంగారం దిగుమతులు 23 శాతం తగ్గి 98.1 టన్నులకు చేరింది. రీసైక్లింగ్ ప్రక్రియ 17 శాతం క్షీణించి 19.2 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది మే నెలలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం పెంచిన విషయం తెల్సిందే.
ALSO READ: పసిడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధరలు
గోల్డ్ ETF డిమాండ్- WGC డేటా ప్రకారం.. ఈ త్రైమాసికంలో గోల్డ్ ETF డిమాండ్ 4.2 టన్నులుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగింది. విలువ పరంగా గోల్డ్ ETF డిమాండ్ రూ.6,300 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 136 శాతం పెరిగిందన్నమాట.అధిక ధరల వాతావరణంలో వినియోగదారులు బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం స్పష్టం చేస్తోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ అన్నారు.