Illegal Hotel Bill Surcharges: దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసే సామాన్య వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇటీవలి కాలంలో కొన్ని హోటళ్లు మెనూ కార్డులో ఉన్న ధరలకు అదనంగా రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదులు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
రెస్టారెంట్లు లేదా హోటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలకు సంబంధించి మెనూ కార్డులో ముద్రించిన ధరలే ప్రామాణికం కావాలి. కానీ బిల్లు చెల్లించే సమయంలో ఆ ధరలకు అదనంగా గ్యాస్ ఛార్జ్ లేదా ఫ్యూయల్ సర్చార్జ్ పేరిట అదనపు మొత్తాన్ని వసూలు చేశాయి పలు రెస్టారెంట్లు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. వినియోగదారుడు కేవలం మెనూలో పేర్కొన్న ధర, దానికి వర్తించే ప్రభుత్వ పన్నులు (GST) మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి ఏ ఒక్క రూపాయి అదనంగా అడిగినా అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.
హోటళ్లు తమ ధరలను పెంచడానికి లేదా అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి ఇంధన కొరతను సాకుగా చూపకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరా గతంతో పోలిస్తే 50 శాతం వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంధన సరఫరా మెరుగ్గా ఉన్నందున, వంట గ్యాస్ కొరత ఉందనే పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే భారతదేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు దశాబ్దాలుగా సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్నాయి. అయితే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను 2017లోనే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ తర్వాత జూలై 4, 2022న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మరింత కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు తమంతట తాముగా బిల్లులో సర్వీస్ ఛార్జీని కలపకూడదని ఆదేశించింది.
ప్రతి వినియోగదారుడు తన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరం. హోటల్ యాజమాన్యాలు అదనపు ఛార్జీల కోసం ఒత్తిడి చేస్తే, వాటిని ప్రశ్నించే హక్కు వినియోగదారుడికి ఉంది. ఒకవేళ ఏవైనా అక్రమ వసూళ్లు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే ప్రభుత్వ హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ 1800-11-4000కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారుల బృందం విచారణ చేపట్టి సదరు హోటల్పై భారీ జరిమానాలు లేదా లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రయాణికులు, పర్యాటకులు హోటల్కు వెళ్లినప్పుడు బిల్లును క్షుణ్ణంగా తనిఖీ చేసి, మోసపోకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Read Also: Free Gas Connection: 5 కేజీల బుల్లి సిలిండర్.. సామాన్యుడికి భలే ఊరట, ఉచిత కనెక్షన్ కోసం ఇలా చేయండి!