IDFC First Bank Scam: హర్యానా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఆదివారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. చండీగఢ్లోని ఓ బ్యాంకు శాఖలో కొంతమంది ఉద్యోగులు, సిబ్బంది కలిసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో మోసపూరిత కార్యకలాపాలు నిర్వహించినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ గుర్తించింది. ఈ మోసం వెనుక ఇతర వ్యక్తులు, సంస్థలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు.
హర్యానా ప్రభుత్వం తమ ఖాతాను క్లోజ్ చేసి..నిధులను వేరే బ్యాంకుకు బదిలీ చేయమని కోరినప్పుడు ఈ మోసం బయటపడింది. ఈ ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.590 కోట్లు తక్కువగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒక తేడాతో మొదలైన తనిఖీ చివరికి రూ.590 కోట్లకు చేరింది. తదుపరి సమాచారం, క్లెయిమ్ల ధ్రువీకరణ, రికవరీల ఆధారంగా తుది మొత్తాన్ని నిర్ణయిస్తామని ఐడీఎఫ్సీ వివరించింది. ఫిబ్రవరి 18 నుంచి హర్యాణా ప్రభుత్వ సంస్థల ఇతర ఖాతాల్లో కూడా ఇలాంటి సమస్యలు గమనించినట్లు బ్యాంకు తెలిపింది.
ఈ స్కామ్ బయటకు రావడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా స్పందించారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు దాదాపు 20% పడిపోయాయి. ఈ ఆర్థిక ఉల్లంఘనతో బ్యాంక్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఐడీఎఫ్సీ పేర్కొంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అధికారులకు తెలియజేసింది.
Also Read: స్మార్ట్ఫోన్ సెక్యూరిటీ గార్డ్గా చాట్జిపిటి.. ఫోన్లో మాల్వేర్ని సెకండ్స్లో పట్టేస్తుంది
ఈ స్కామ్ పై ప్రత్యేక కమిటీ ఫిబ్రవరి 20న సమావేశమైంది. ఆ తర్వాత ఆడిట్ కమిటీ, పూర్తి బోర్డు సమావేశమైంది. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ను నిర్వహించడానికి బోర్డు సభ్యులు నిర్ణయించారు. అనుమానాస్పద లబ్ధిదారుల ఖాతాలను గుర్తించిన బ్యాంకు.. ఇతర బ్యాంకులకు అలర్ట్ చేసింది. బ్యాంకు సిబ్బంది కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.