Delhi Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. చారిత్రక కట్టడమైన ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీ భవనానికి బాంబు పెట్టినట్లు వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు ఆయా పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. అత్యాధునిక పరికరాలు, జాగిలాల సాయంతో అణువణువూ గాలించిన అధికారులు.. అక్కడ ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని అధికారికంగా ధృవీకరించారు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలడంతో అధికారులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
కేవలం ఈ రెండు ప్రాంతాలే కాకుండా ఉదయం ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఈ వరుస సంఘటనల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సాయంతో మెయిల్స్ పంపిన మూలాలను ఆరా తీస్తున్నారు. కాగా నిన్న జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో వరుస బెదిరింపులు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా పరంగా రాజధానిలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.
Read Also: Jamili : తెలంగాణలో జమిలి.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్?